పాన్-ఆధార్ లింక్పై గుడ్న్యూస్, కానీ షరతు: ఆ లోపు లింక్ చేయకుంటే చెల్లదు
న్యూఢిల్లీ: ఆగస్ట్ 31వ తేదీలోగా పాన్ కార్డు - ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి. ఆదాయపన్ను రిటర్న్స్ ఫైలింగ్కు పాన్కు బదులు ఆధార్ను ఉపయోగించవచ్చునని ఇటీవల బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండింటిలో దేనినైనా ఉపయోగించే వెసులుబాటు కల్పించింది.
మారిన పాన్ - ఆధార్ కార్డు నిబంధనలు, కొత్త రూల్స్ ఇవే
ఈ వెసులుబాటు కల్పించినప్పటికీ ఆధార్ - పాన్ కార్డు లింకింగ్ తప్పనిసరి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆగస్ట్ 31వ తేదీలోగా అనుసంధానం చేయకుంటే అలాంటి పాన్ కార్డులు చెల్లనివిగా గుర్తిస్తారని తెలిపారు.
పాన్ కార్డు లేనివారు ఆధార్ కార్డు ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే వారికి వర్చువల్ పాన్ నెంబర్కేటాయిస్తారు. వారికి అదే పాన్ నెంబర్ అవుతుంది. అయితే ఇప్పటికే పాన్ కార్డు ఉన్న వారు ఆధార్తో లింక్చేయకుంటే మాత్రం అలాంటి పాన్ కార్డులు తాత్కాలికంగా నిలిపివేస్తామని, ఓసారి అను సంధానమయ్యాక వాటిని పునరుద్ధరించుకునే వెసులుబాటు కల్పిస్తామని చెబుతున్నారు. ఇంతకుముందు వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆగస్ట్ 31లోగా లింక్ చేయకుంటే తాత్కాలికంగా నిలిపివేసి, అనుసంధానం అయ్యాక పునరుద్ధరించడం శుభవార్తే. అయితే కొన్నాళ్లకు అలా చేయకుంటే శాశ్వతంగా తొలగిస్తారు.
ఆధార్తో అనుసంధానం చేయకుంటే అవి నకిలీగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీటి అనుసంధానం తప్పనిసరి చేసింది. దేశంలో 43 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 22 కోట్లు మాత్రమే ఆధార్తో అనుసంధానం అయ్యాయి. మిగిలిన పాన్ కార్డులు లింక్ కావాల్సి ఉంది.