మేడిన్ ఇండియా: వచ్చె నెలలో మార్కెట్లోకి భారత్లో తయారైన యాపిల్ ఐఫోన్లు
న్యూఢిల్లీ:భారత్లో ప్రతిష్టాత్మకంగా ఫాక్స్కాన్ సంస్థ ప్రారంభించిన ఐఫోన్ల అసెంబ్లింగ్ యూనిట్ నుంచి తయారు అయిన ఐఫోన్లు వచ్చేనెలలో మార్కెట్లోకి విడుదల కానున్నట్లు సమాచారం. భారత్లోనే తయారు కావడంతో ఈ ఐఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. మరికొన్ని వాటికి అనుమతులు రావాల్సి ఉందని.. అయితే భారత్లో తయారైన ఐఫోన్-ఎక్స్ ఆర్ మరియు ఐఫోన్ -ఎక్స్ ఎస్ వచ్చే నెల ఆగష్టులో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ విషయమై యాపిల్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఫాక్స్కాన్ కూడా తమ ఉత్పత్తులపై స్పందించేందుకు నిరాకరించింది. భారత్లో స్థానికంగా తయారు అయ్యాయి కాబట్టి వీటిపై అధిక స్థాయిలో పన్నులు ఇతరత్ర ట్యాక్సులు ఉండవు. యాపిల్ ఐఫోన్లను కొన్ని లక్షల మంది భారతీయులు వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ చైనా సంస్థ వన్ ప్లస్ నుంచి అధిక పోటీని ఎదుర్కొంటోంది.
ఇదిలా ఉంటే కాలిఫోర్నియాలోని క్యూపర్టినో సంస్థ బెంగళూరులోని యూనిట్లో తక్కువ ధర ఐఫోన్లు ఎస్ఈ, 6ఎస్ 7 మోడల్స్ను తయారు చేస్తోంది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్లో స్మార్ట్ ఫోన్ తయారీకి కేంద్రంగా తయారు చేయాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం అన్ని ప్రోత్సహకాలు ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయడంతోనే భారత్లో తమ సంస్థలు ఏర్పాటు చేసేందుకు శాంసంగ్, వన్ ప్లస్లు ముందుకొచ్చాయి. వారి యూనిట్లను కూడా పెంచుకుంటూ పోయాయి.
చైనా అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్దం కారణంగా యాపిల్ సంస్థ భారత్లో తమ సంస్థలను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఐఫోన్ల సేల్స్ను కూడా తగ్గించింది ఆ సంస్థ. ఇక భారత్లో తయారైన ఐఫోన్ 6ఎస్ 7 మోడళ్లను యూరోప్, హాంగ్కాంగ్లకు ఎగుమతి చేస్తోంది.