జగన్ చేతికి దివాళా ఏపీ, ప్రతి వ్యక్తిపై రూ.1 లక్ష అప్పు, రూ.10వేల వడ్డీ
అమరావతి: 2006-07 సంవత్సరంలో 1 శాతం రెవెన్యూ సర్ప్లస్గా ఉన్న రాష్ట్రం క్రమంగా దిగజారి 0.24 శాతం పడిపోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ద్వారా వెల్లడైంది. అయితే, 2014-19 మధ్య రాజధాని లేని ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. బుధవారం ఏపీ గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థపై వైట్ పేపర్స్ విడుదల చేసింది. టీడీపీ ప్రభుత్వం అవకతకలకు పాల్పడిందని, అంకెల గారడీ చేసిందని, పెట్టుబడుల అంశంపై నిర్లక్ష్యం వహించిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఎన్నడూ లేనంత చీకట్లోకి ఏపీ నెట్టబడిందని పేర్కొన్నారు.
అందరికీ ఉచిత వైద్యం! తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్
ప్రతి పౌరుడు రూ.10వేలు చెల్లించాల్సిన పరిస్థితి
ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్స్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. గత అయిదేళ్ల పాలనలో కనీవినీ ఎరుగని అవినీతి, ప్రైవేటు అవసరాల కోసం సహజవనరుల దోపిడీ వంటివి చోటు చేసుకున్నాయన్నారు. తమకు దివాళా రాష్ట్రాన్ని అప్పగించారన్నారు. దైర్యంగా ఎదుర్కొంటామన్నారు. రూ.3.62 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని తెలిపారు. ప్రతి పౌరుడు ఏడాదికి రూ.10వేల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితిలో ఉందని చెప్పారు. లేని అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చూపించిందన్నారు. 2004-05 మధ్య పేదరికం తగ్గి, మానవాభివృద్ధి జరిగితే, 2014-19 మధ్య అందుకు భిన్నంగా చోటు చేసుకుందన్నారు.
FRBMను మించి అప్పులు
గత ప్రభుత్వం అయిదేళ్లలో ఎక్కువగా అప్పులు చేసిందని, ఈ కారణంగానే ఏపీ అప్పులు రూ.3.62 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. గత ప్రభుత్వమే 2,58,000 కోట్ల అప్పులు చేసిందన్నారు. FRBM చట్టం ప్రకారం రాష్ట్ర డీజీపీలో 3 శాతం దాటి అప్పులు చేయవద్దన్నారు. దానికి మించి టీడీపీ అప్పులు చేసిందన్నారు. 2017-18లో పరిమితికి మించి 4.08 శాతం అప్పులు చేసిందన్నారు. 2014-17 మధ్య ఏపీలో 5 శాతం వృద్ధి మాత్రమే ఉందని, ద్రవ్యోల్భణం జాతీయస్థాయిలో తగ్గగా, ఏపీలో మాత్రం భారీగా పెరిగిందన్నారు. గత ప్రభుత్వం వృద్ధి అంచనాలు పెంచి చూపిందని ఆరోపించారు.
తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నాం
పన్ను రూపంలో వచ్చే ఆదాయంలో తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నామన్నారు. రెవెన్యూ లోటు రూ.66వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. తలసరి ఆదాయంపరంగా తెలంగాణ కంటే బాగా వెనుకబడి ఉన్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలని, కానీ టీడీపీ సర్కార్ తీసుకుందని, అలాగే, దుగరాజుపట్నంను కేంద్రమే కట్టాలని, దానిని టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2018-19 డిస్కంలకు రూ.8వేల కోట్లు రావాల్సి ఉండగా, రూ.2,500 కోట్లు మాత్రమే కేటాయించి, రూ.1,200 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు.
రూ.18,000 కోట్ల పెండింగ్ బిల్లులు
గత ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూపంలో రూ.58,000 కోట్లు, విద్యుత్ శాఖ, పౌరసరఫరాల శాఖల కార్పొరేషన్ల ద్వారా రూ.28,375 కోట్ల రుణం తీసుకుందని, పెండింగ్ బిల్లులు రూ.18,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తూ, ఆశా, అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్ లాంటి చిరుద్యోగుల బిల్లులు, మధ్యాహ్న భోజన పథకం బిల్లులు, హోంగార్డుల వేతనాల బిల్లును పెండింగులో ఉంచారన్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంపై స్థూల జాతీయోత్పత్తిలో 35 శాతం(రూ.3,62,375) చెల్లింపుల భారాన్ని మిగిల్చిందన్నారు.
ఏపీలో ఒక్కొక్కరిపై రూ.లక్ష అప్పు
ఏపీలో పుట్టిన బిడ్డపై తలసరి రుణభారం రూ.42,500 ఉన్నాయని చెప్పారు. ఎస్పీవీ, ఇతర అప్పులు తీసుకుంటే తలసరి అప్పు రూ.1 లక్ష ఉందని చెప్పారు. దీనికి ప్రతి పౌరుడు రూ.10వేలు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి అన్నారు. కొత్త ప్రాజెక్టులకు నిధులు లేవని, దివాళా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పగించారని తెలిపారు. ప్రతి నెల ఓవర్ డ్రాఫ్టుకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని, ఇది ఏపీ రేటింగ్ పైన ప్రభావం చూపుతోందన్నారు.
అప్పుల భారం ఇలా...
ఏపీ రుణం రూ.2,58,000 కోట్లుగా ఉంది. బడ్జెటేతర అఫ్పులు రూ.58,000 కోట్లుగా ఉంది. విద్యుత్ రంగ బకాయిలు రూ.18,000 కోట్లుకు పైగా ఉన్నాయి. పౌరసరఫరాల కార్పోరేషన్ పెండింగ్స్ రూ.10వేల కోట్లు, పెండింగులో ఉన్న బిల్లులు రూ.18వేల కోట్లు ఉన్నాయి. అన్నీ కలుపుకొని రూ.3.62 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.