10 బిలియన్ డాలర్ల ఫోన్పే: ఫ్లిప్కార్ట్ను కొన్న వాల్మార్ట్కు డబుల్ బొనాంజా
న్యూఢిల్లీ: డబుల్ బొనాంజా... ఎవరైనా ఒక వస్తువును కొనుగోలు చేస్తే మరో వస్తువు తక్కువ ధరకు రావడం లేదా ఉచితంగా వస్తే దీనిని ఉపయోగిస్తాం. సాధారణంగా చిన్న చిన్న అంశాల్లో ఈ డబుల్ బొనాంజా కనిపిస్తుంది. కానీ ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం వాల్మార్ట్కు ఇండియాలో ఇది దక్కింది. ఊహించని విధంగా అద్భుతమైన బెనిఫిట్స్ వచ్చాయి. ఇది ఇండియా ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ను అక్వైర్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఫోన్పే రూపంలో డబుల్ బొనాంజా తగిలింది.
ఫోన్ పే 10 బిలియన్ డాలర్ల వ్యాల్యూ కలిగిన కంపెనీగా...
అమెరికన్ రిటైల్ జెయింట్ వాల్మార్ట్ గత ఏడాది ఫ్లిప్కార్ట్ను 16 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. ఈ డీల్లో భాగంగా ఫోన్పేను కూడా సొంతం చేసుకుంది. ఈ డీల్ జరిగినప్పుడు ఫోన్పేకు అప్పుడప్పుడే ఆదరణ వస్తోంది. ఆ తర్వాత దేశంలో వేగంగా వృద్ధి చెందిన స్టార్టప్గా ఫోన్పే నిలిచింది. ఇప్పుడు ఫోన్పే దూసుకెళ్తోంది. ఔట్సైడ్ ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు ఫోన్ పే కోసం సమీకరించాలని ఇటీవలే ఫ్లిప్కార్ట్ నిర్ణయించింది. మొత్తంగా ఇది పది బిలియన్ డాలర్ల వ్యాల్యూ కలిగిన కంపెనీగా మారనుంది.
డబుల్ బొనాంజా
అంటే వాల్మార్ట్.. ఫ్లిప్కార్ట్ను కొనుగోలు చేయడం ద్వారా 10 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఫోన్పే రావడం డబుల్ బొనాంజానే. కాగా, ఈ నిధులు రానున్న ఒకటి రెండు నెలల్లో సమీకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే చర్చలు ఇంకా ముగియలేదని అంటున్నారు. ప్రత్యేక పెట్టుబడులతో ఇది ఇప్పుడు ఇండిపెండెంట్గా మారనుంది. అయినప్పటికీ ఫ్లిప్కార్ట్ షేర్లు ఉంటాయి.
వేగంగా పుంజుకుంటున్న ఫోన్ పే
డిజిటల్ పేమెంట్ కంపెనీల్లో ఫోన్పే వేగంగా ఎదిగింది. గత ఏడాది కాలంగా దీని ట్రాన్సాక్షన్స్ నాలుగింతలు పెరిగాయి. ఇప్పుడు చాలామంది పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ మార్గాల్లో చెల్లింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం వారెన్ బఫెట్కు చెందిన పేటీఎం ఇందులో టాప్లో ఉంది. ఇప్పుడు ఫోన్పే కూడా వేగంగా పుంజుకుంటోంది. అయితే ఫోన్పే బిజినెస్ వ్యాల్యూ 14 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫోన్పే ఆపరేషన్స్ కోసం 2014 ఆగస్ట్ 26న ప్రభుత్వం అనుమతులు తీసుకొని, 2015 డిసెంబర్ నుంచి ఆపరేషన్స్ ప్రారంభించింది. ఏప్రిల్ 2016లో కంపెనీని ఫ్లిప్కార్ట్ అక్వైర్ చేసుకుంది.