చైనా కంపెనీలు భారత ఎలక్ట్రిక్ మార్కెట్లో పాగా వేస్తే!
పొరుగు దేశం చైనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కాస్త సందు దొరికితే చాలు మొత్తం చుట్టేసుకుపోతుంది. ముఖ్యంగా తయారీ రంగంలో చైనా సత్తా చాటుకుంటుంటోంది. గుండు సూది నుంచి విమానంవరకు తయారు చేస్తోంది. తయారీలో తనకు ఎవరు సాటి రారంటూ భింకాలకు పోతోంది. అనేక దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ వచ్చే విదేశీ మారక నిల్వల ద్వారా పెద్దఎత్తున తయారీ కేంద్రాలను విస్తరిస్తోంది. వేరే దేశాలను పట్టించు కోకుండా తన వ్యూహానికి అనుగుణంగా ముందుకు వెళుతోంది.
ఈ దేశ ఎగుమతులు ఇష్టారాజ్యంగా ఉండటం వల్లనే అమెరికా వాణిజ్య యుద్దానికి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తన దేశానికి చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచింది. అయినా చైనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు వేసి సవాలు విసిరింది. తన తయారీ సామర్థ్యాలను క్రమంగా పెంచుకోవడమే కాకుండా పొరుగు దేశాల్లోని కంపెనీలకు తీవ్రమైన పోటీని ఇస్తోంది.
ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ పై కన్ను
చైనా కన్ను ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ పై పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరిగిపోతోంది. ఇంధనాలతో నడిచే వాహనాలవల్ల కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని దేశాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన మంత్రం జపిస్తున్నాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట వేస్తోంది. వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్ 6 ఉద్గార ప్రమాణాలను అమలు చేస్తోంది. మరో ఐదు పదేళ్ల కాలంలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలో భారత ఎలక్ట్రిక్ మార్కెట్లో ఉన్నఅవకాశాలపై చైనా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.
ఇప్పటికే కొన్ని కంపెనీలు వచ్చాయి
* దేశంలో అపార మార్కెట్ అవకాశాలున్న నేపథ్యంలో గత మూడునాలుగేళ్ల కాలంలో పది పన్నెండు చైనా కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. వీటిలో కొన్ని దేశంలోని కంపెనీలతో చేతులుకలపగా మరికొన్ని కంపనీలు సొంతంగానే కార్యకలాపాలు చేపట్టడానికి సిద్ధమయ్యాయి.
* ఈ కంపెనీలు తయారీ కేంద్రాలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి.
* చైనా కంపెనీలు ఎలక్రిక్ స్కూటర్లు, ఈ-బైక్ లు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు తయారు చేస్తున్నాయి.
* చైనాకు చెందిన బెన్ లింగ్, సీఎఫ్ మోటో, సున్ రా, గెమోపై ఎలక్ట్రిక్, ఎవోక్ మోటార్ సైకిల్ వంటివి ఉన్నాయి. జెజియాంగ్ గీలి హోల్డింగ్ కు చెందిన
* వోల్వో కార్స్, ఎస్ ఏ ఐ సి మోటార్ కార్పొరేషన్ కు చెందిన ఎంజీ మోటార్స్, గ్రేట్ వాల్ మోటార్స్ వంటి కంపనీలు తయారీ కేంద్రాలతో పాటు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేశాయి.
మొబైల్ ఫోన్ల కంపెనీలే ఉదాహరణ
చైనా మొబైల్ ఫోన్ల కంపెనీలు భారత మార్కెట్లో ఏవిధంగా విస్తరించాయో అందరికీ తెలిసిందే. ఆన్ లైన్ మార్కెట్ ద్వారా భారత మార్కెట్లోకి వచ్చిన ఈ కంపెనీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఆన్ లైన్ లో అమ్మకాలు సాగిస్తూనే రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయాలు పెంచుకుంటున్నాం.
* ఈ కంపెనీల ద్వారా మొబైల్ ఫోన్ల మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరిగి పోయింది.
* చైనా కంపెనీలు దేశీయంగానే మొబైల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి.
* ఇక్కడే పరిశోధన , అభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాయి.
* ఈ కంపెనీల వల్ల దేశీయ కంపెనీలు గట్టి పోటీని ఎదుర్కొంటూ తమ యూనిట్లను మూసివేసుకునే పరిస్థితి నెలకొంది. ఫలితంగా వేలాది మంది ఉపాధిపై దెబ్బపడుతుంది.
ఇప్పుడు చైనా కంపెనీలు భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి కూడా ప్రవేశిస్తున్న నేపథ్యంలో రానున్న కాలంలో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో వేచి చూడాలంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.