పెట్రోల్, డీజిల్, బంగారం, సూపర్ రిచ్కు షాక్, ఖజానాకు రూ.30వేల కోట్లు
న్యూఢిల్లీ: సూపర్ రిచ్పై ఎక్కువ ట్యాక్స్ విధింపు, పెట్రోల్, డీజిల్ పైన సెస్ కారణంగా ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరం రూ.30,000 కోట్ల అదనపు ఆదాయం రానుందని రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. వీటితో పాటు బంగారం వంటి విలువైన మెటల్స్పై కస్టమ్స్ డ్యూటీ కారణంగా కూడా ఖజానాకు అదనపు ధనం రానుందన్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలపై కార్పోరేట్ ట్యాక్స్ 25 శాతంగా ఉండగా, ఇక నుంచి రూ.400 కోట్ల ఆదాయం దాటిన కంపెనీలపై ఉండనుంది. దీంతో ప్రభుత్వానికి నష్టం కలగనుంది.
జూలై1 నుంచే మార్పు.. రైల్వే టైంటేబుల్, RTGS-NEFT ఛార్జీలు
ఎక్కడి నుంచి ఎంత రాబడి అంటే
రూ.30,000 కోట్ల రాబటిలో రూ.22,000 కోట్లు పెట్రోల్, డీజిల్పై విధించిన సెస్ ద్వారా లభించనుంది. వార్షిక ఆదాయం రూ.2 నుంచి 5 కోట్లు, అంత కంటే ఎక్కువ ఉన్న సంపన్నులపై ఆదాయ పన్ను రేటు పెంపు ద్వారా ఏటా రూ.12,000 కోట్ల నుంచి రూ.13,000 కోట్లు, బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకం పెంపు ద్వారా మరో రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా.
లాభం.. నష్టం
రూ.2-5 కోట్ల ఆదాయం కలిగిన వారిపై 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్లకు పైగా ఆదాయం కలిగిన వారిపై పన్ను 15 శాతం నుంచి 37 శాతానికి పెంచారు. అలాగే బంగారం వంటి మెటల్స్ పైన కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. రూ.400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ కలిగిన కంపెనీలపై ఆదాయ పన్ను రేటును 25 శాతంగా నిర్ణయించారు. దీంతో కార్పొరేట్ టాక్స్ రాబడుల్లో రూ.4,000 కోట్ల వరకు కోత పడనుందని అంచనా. ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వ ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్లు రానున్నాయి.
విదేశీ బాండ్స్ ద్వారా నిధుల సేకరణ
మరోవైపు, విదేశీ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో నిధులు సేకరించేందుకు కేంద్ర సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నాటికి విదేశాల్లో సావరిన్ బాండ్స్ జారీ చేయడం ద్వారా భారీస్థాయిలో నిధులను సమీకరించాలనుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. విదేశీ మార్కెట్లలో విదేశీ కరెన్సీ రూపంలో జారీచేయనున్న బాండ్స్ ద్వారా అధిక మొత్తంలో నిధులు సేకరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎంతమొత్తంలో నిధుల సేకరించేదానిపై ఇంకా స్పష్టత రాలేదని, ఇందుకు సంబంధించి ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. విదేశాల్లో నిధుల సేకరణకు సంబంధించి త్వరలో కేంద్రం ప్రత్యేక సలహాదారుడిని నియమించబోతుందన్నారు. మన అవసరాలకు విదేశాల్లో గరిష్టస్థాయిలో నిధులను సేకరించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా ఫారెన్ కరెన్సీ రూపంలో బాండ్స్ జారీ చేసి, సులభంగా నిధుల సేకరించవచ్చని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ల నుంచి రూ.4.48 లక్షల కోట్ల నిధులను సేకరించాలని కేంద్రం భావిస్తోంది.