ఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు ఇవే...: బ్యాంక్ విత్డ్రా రూ.1 కోటి దాటితే 2 శాతం TDS
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్నుపై బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం కలిగిన వారికి పన్ను మినహాయింపును గత మధ్యంతర బడ్జెట్లోనే ప్రకటించారు. తాజాగా, ఆదాయ పన్ను పరిమితిలో మార్పు లేదు. కానీ అదనపు ప్రయోజనాలు మాత్రం ఉన్నాయి. రూ.45 లక్షల లోపు హోమ్ లోన్స్ పైన రూ.3.5 లక్షల వడ్డీ రాయితీని ప్రకటించారు. గతంలో రూ.2 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.మూడున్నర లక్షలకు పెంచారు.
రూ.1 కోటి విత్ డ్రాయల్స్ పైన 2 శాతం టీడీఎస్
ఏడాదికి రూ.1 కోటి విత్ డ్రాయల్స్ పైన 2 శాతం TDS విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంటే బ్యాంక్ ఖాతా నుంచి ఏడాదికి నగదు ఉపసంహరణ పరిమితి రూ.కోటి. అది దాటితే 2 శాతం టీడీఎస్ ఉంటుంది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిపై సర్చార్జ్ పెంచారు.
సర్ఛార్జీలు ఇలా...
రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (HNI) ఇన్కం ట్యాక్స్ సర్చార్జ్ పెంచారు. ఏడాదికి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం ఉంటే సర్చార్జ్ను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచారు. ఏడాదికి రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారిపై సర్ఛార్జ్ 15 శాతం నుంచి 37 శాతానికి పెంచారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట కీలక అంశాలు: బడ్జెట్లో ఏం చెప్పారు?
ఐటీ రిటర్న్స్ ఆధార్ కార్డుతోను దాఖలు చేసే అవకాశం
పాన్ నంబర్ లేకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలుకు అవకాశం కల్పించారు. పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్తో ఐటీ రిటర్న్స్ దాఖలుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కార్పోరేట్ ట్యాక్స్ పరిధిని రూ.400 కోట్లకు పెంచారు.
ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలు
వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో మార్పులు లేవు. ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలుగా చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను స్లాబుల్లో వెసులుబాటు ఉంటుందని ఉద్యోగులు భావించారు. కానీ ఆ ఊరట దక్కలేదు. నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారికి అభినందనలు. కాగా, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లు 78 శాతం పెరిగినట్లు ప్రకటించారు. ట్యాక్స్ కలెక్షన్లు 2013-14 రూ.6.38 కోట్ల నుంచి ఇప్పుడు 11.27 కోట్లకు పెరిగాయి.