ఓలా ఎలక్ట్రిక్లోకి రూ 1,725 కోట్ల పెట్టుబడి
ప్రముఖ రైడ్ హైలింగ్ సంస్థ ఓలా అనుబంధ కంపెనీ ఐన ఓలా ఎలక్ట్రిక్ కి భారీ పెట్టుబడి అందింది. జపాన్ కు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థ సాఫ్ట్ బ్యాంకు ఈ పెట్టుబడి ని సమకూర్చింది. తాజాగా 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ 1,725 కోట్లు ) పెట్టుబడి పెట్టింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లకు పెరిగింది.
భవిష్యత్ టెక్నాలజీగా భావిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగం లో ప్రైవేట్ పెట్టుబడి దారులు భారీగా నిధుల కుమ్మరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలూ పట్టణాల్లో క్యాబ్ సేవలను అందిస్తూ ఉబెర్ కు గట్టి పోటీ ఇస్తున్న ఓలా సంస్థ... 2022 నాటికీ భారత్ లో 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం భారీగా నిధులను సమకూరుస్తోంది.
ఇప్పటికే ప్రముఖ వెంచర్ కాపిటల్ సంస్థలు ఐన మెట్రిక్ పార్టనర్స్, టైగర్ గ్లోబల్ తో పాటు రతన్ టాటా నుంచి రూ 400 కోట్ల నిధులను ఓలా ఎలక్ట్రిక్ సమీకరించింది. తాజాగా సేకరించిన పెట్టుబడితో ఓలా .... ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలికసదుపాయాలు - బాటరీ ఛార్జింగ్ కేంద్రాలు, తయారీ వ్యవస్థ తో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు వెచ్చించే అవకాశం ఉన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం లో పేర్కొంది.
అప్పుల్లో కూరుకుపోయారా? అయితే ఇలా బయటపడండి..
ఓలా ఎలక్ట్రిక్లో 24 శాతం వాటా
ఓలా మాతృ సంస్థ లో ఇప్పటికే 25% వాటా కలిగిన సాఫ్ట్ బ్యాంకు .... ఓలా ఎలక్ట్రిక్ లోనూ దాదాపు 24% వాటా ను సొంతం చేసుకొంది. సాఫ్ట్ బ్యాంకు వ్యవస్థాపకుడు మసాయాషి సొన్ ఇందులో 1 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడికి ఆసక్తి కనబరిచినప్పటికీ, ఓలా కో ఫౌండర్ భవిష్ అగర్వాల్ మాత్రం కంపెనీలో తన వాటాను తగ్గించుకునేందుకు అంగీకరించలేదట.
పైలట్ ప్రాజెక్టు
ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ లో ప్రయోగాత్మక చర్యలను చేపట్టింది. దేశంలో తొలిసారిగా నాగపూర్ నగరం లో తన ఎలక్ట్రిక్ వాహనాలను పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా నడుపుతోంది. ఇది విజయవంతం అయితే మిగితా నగరాలకు తన సేవలను విస్తరించనుంది. తొలుత ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను ఇందుకోసం ఓలా ఎలక్ట్రిక్ వినియోగిస్తోంది. క్రమంగా కార్లు సహా ఇతర భారీ వాహనాలను ప్రవేశ పెట్టె అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
పెరుగుతున్న కాలుష్యానికి విరుగుడుగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ దిశగా ఇప్పటికే పలు చర్యలు తీసుకొంటోంది. నానాటికీ పెరిగి పోతున్న చమురు ధరలకు చెక్ పెట్టాలన్న... ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గించాలన్న ఎలక్ట్రిక్ వాహనాలు దిక్కుగా తోస్తోంది. అందుకే ఈ రంగంలో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ కంపెనీలతోనూ ప్రభుత్వం జట్టు కడుతోంది. ఈ దిశగా ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కూడా ప్రభుత్వం తో కలిసి రాణిస్తోంది.