ట్రేడ్ వార్: ఒప్పందం మాకు అనుకూలంగా ఉండాలి.. చైనాకు ట్రంప్ మెలిక
వాషింగ్టన్: G20 సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ మధ్య చర్చల అనంతరం ట్రేడ్ వార్ తాత్కాలికంగా ముగిసింది. అయితే తాజాగా, ట్రంప్ ఓ మెలిక పెట్టారు. చైనాతో ఒప్పందం తమకు అనుకూలంగా ఉండాలని ప్రకటించారు. అమెరికాకు లాభం ఉంటేనే బీజింగ్తో ఒప్పందం ఉంటుందని తేల్చి చెప్పారు. ఇప్పటికే వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయన్నారు.
చైనా - అమెరికా వాణిజ్య చర్చలు మే నెలలో నిలిచిపోయాయి. జీ20 సమ్మిట్ నేపథ్యంలో ఇవి తిరిగి ప్రారంభమయ్యాయని ట్రంప్ తెలిపారు. రెండు దేశాలు ఆర్థికంగా సూపర్ పవర్ కలిగినవని, అయితే ఈ చర్చల్లో తమకు లాభం ఉండాలని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఫోన్ ద్వారా కూడా సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. అలాగే సమావేశాలు జరుగుతున్నాయన్నారు. తాను, జీ జిన్పింగ్ భేటీకి ముందే చర్చలు ప్రారంభమయ్యాయన్నారు.
హువావేకు ట్రంప్ ఊరట: నిషేధం ఎత్తివేత, టెక్నాలజీ విక్రయించవచ్చు
వాణిజ్యం కారణంగా చాలాకాలంగా చైనానే ప్రయోజనం పొందుతోందని, కాబట్టి ఈ చర్చల ఫలితాలు అమెరికా కంటే బీజింగ్కే ఎక్కువ లబ్ధి చేకూరుస్తాయని ట్రంప్ అన్నారు. చర్చలు మాత్రం కచ్చితంగా అమెరికాకు అనుకూలంగా ఉండాలన్నారు. ఇంతకాలం వాణిజ్య పరంగా చైనా చాలా లబ్ధి పొందిందని, కాబట్టి ఈసారి 50-50 డీల్కు అంగీకరించేది అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. కాబట్టి వాషింగ్టన్కు కాస్త ప్రయోజనకారిగా ఉండాలన్నారు.
చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు వాషింగ్టన్కు ప్రయోజనకారిగా కూడా ఉంటాయని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, అమెరికా - చైనా వాణిజ్య చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్స్ పుంజుకుంటున్నాయి. జీ20 సమ్మిట్ అనంతరం చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ హువావేపై ట్రంప్ ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే.