పేటీఎం షాకిస్తోందా, ట్రాన్సాక్షన్ ఛార్జీ తప్పించుకోవాలంటే ఏం చేయాలి?
డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్! వ్యాలెట్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డు పేమెంట్స్ పైన తాము ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయడం లేదని పేటీఎం ప్రకటించింది. జూలై 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డు పేమెంట్లపై 1 శాతం, డెబిట్ కార్డులపై 0.9 శాతం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పైన రూ.12.15 వరకు ట్రాన్సాక్షన్ పైన ఛార్జీలు ఉంటాయని ప్రచారం జరిగింది. దీంతో పేటీఎం యూజర్లు ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తలపై పేటీఎం స్పందించింది.
పీఎం-కిసాన్ సాయం రూ.8,000కు పెంచే ఛాన్స్
|
పేటీఎం ట్వీట్
ఎలాంటి ట్రాన్సాక్షన్ పైన కూడా తాము ఏ ఛార్జీలు, ఫీజులు విధించడం లేదని పేటీఎం స్పష్టం చేసింది. ఈ మేరకు పేటీఎం నేడు (జూలై 1) ట్వీట్ చేసింది. ముఖ్యమైనది.. అంటూ ఈ ట్వీట్ చేసింది. కార్డులు, యూపీఐ, వాలెట్ ద్వారా చెల్లింపులు జరిపితే కస్టమర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు లేదా ట్రాన్సాక్షన్ రుసుము వసూలు చేయడం లేదని, మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మా బ్లాగ్ చూడండని అందులో పేర్కొంది.
ఏం జరిగింది?
పేటీఎం జూలై 1వ తేదీ నుంచి యూజర్ల జరిపే లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) పేరిట పేటీఎం ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, పేటీఎం వ్యాలెట్కు మనీ యాడ్ చేసే సందర్భంలో కూడా ఛార్జీలు వర్తిస్తాయని ప్రచారం జరిగింది. లాభాలను పెంచుకునే దిశగా పేటీఎం ఈ నిర్ణయం తీసుకుందని భావించారు. అయితే ఈ ప్రచారాన్ని పేటీఎం కొట్టి పారేయడం గమనార్హం.
అన్నీ ఊహాగానాలే
పేటీఎం తన బ్లాగ్లో కూడా పేటీఎం కస్టమర్లు ఈ ప్లాట్ ఫామ్ సేవలను ఉచితంగానే కొనసాగించుకోవచ్చునని పేర్కొన్నారు. గతంలో వలె ఎలాంటి ఫీజు లేకుండా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చునని పేర్కొంది. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఫీజులు ఉండవని పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అన్నీ ఊహాగానాలే అని తేల్చి చెప్పింది.
ఛార్జ్ ఎలా తప్పించుకోవచ్చు
అలాగే, కొందరు మర్చంట్స్ ఎలా చార్జ్ చేస్తున్నారని, వాటిని ఎలా తప్పించుకోవచ్చునో కస్టమర్లకు చెప్పింది. విద్యాసంస్థలు, యూటిలిటీ సర్వీస్ ప్రొవైడర్స్, కొన్ని క్రెడిట్ కార్డు ఛార్జీలను భరించడానికి సిద్ధంగా లేవు. దీంతో ఆ భారం కస్టమర్లపై పడుతోంది. అందుకే అలాంటి సందర్భాల్లో డెబిట్ కార్డు లేదా యూపీఐ ఉపయోగించి ఈ ఛార్జీలను తప్పించుకోవచ్చునని సూచించింది. కొన్ని సందర్భాల్లో ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, యుటిలిటీ సర్వీస్ ప్రొవైడర్లు క్రెడిట్ కార్డు వంటి వాటిపై కొంత మొత్తం ఛార్జ్ చేస్తారని, దానిని తప్పించుకునేందుకు డెబిట్ కార్డు లేదా యూపీఐ ఉపయోగించాలని పేర్కొంది. కొందరు పేటీఎం యూజర్లు.. తమ నుంచి 4-5 శాతం ఛార్జ్ వసూలు చేశారని ట్వీట్లు చేశారు. అయితే ఇది పేటీఎం వసూలు చేసిన ఛార్జ్ కాదని స్పష్టం చేసింది.