స్విస్ బ్యాంకుల్లో భారత్ నల్లధనం తగ్గింది, టాప్ 10 దేశాలివే
బెర్న్: స్విస్ బ్యాంకుల్లో నగదు జమ చేసే దేశాల జాబితాలో భారత్ ర్యాంకు పడిపోయింది. ఏడాది కాలంలో ఆయా దేశాల పౌరులు, వ్యాపారవేత్తలు స్విస్ బ్యాంకుల్లో జమ చేసే నగదును బట్టి ఆ బ్యాంకు ర్యాంకులు ఇస్తుంది. అయితే, నల్లధనంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో స్విస్ బ్యాంకుల్లో ధనం తగ్గుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే యూకే ఈసారి కూడా ముందంజలోనే నిలిచింది. ఇందుకు సంబంధించి స్విస్ నేషనల్ బ్యాంకు (SNB) వివరాలు తెలిపింది.
స్విస్ బ్యాంకులో తగ్గిన భారత్ సొమ్ము
స్విస్ బ్యాంకులో నగదు జమ చేసే జాబితాలో రెండేళ్ల క్రితం భారత్ 88, గత ఏడాది 73వ స్థానానికి ఎగబాకింది. అయితే ఈ ఏడాది 74వ స్థానానికి పడిపోయింది. భారతీయులు వ్యక్తిగతంగా లేదా వ్యాపారపరంగా బ్యాంకుల్లో జమ చేసే నగదు గణనీయంగా తగ్గిందని తెలిపింది. ఇతర దేశాలకు చెందిన వారితో పోలిస్తే ఇది కేవలం 0.07శాతంగా ఉందని తెలిపింది. భారత్తో పోలిస్తే యూకే ఏకంగా 26 శాతం నగదు జమతో మొదటి స్థానంలో ఉంది. యూకే తర్వాత అమెరికా, వెస్టిండీస్, ఫ్రాన్స్, హాంకాంగ్ వరుసగా టాప్ 5లో ఉన్నాయి.
దాచుకున్న నిధులు రూ.99 లక్షల కోట్లు
2018 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు దాచుకున్న నిధులు రూ.99 లక్షల కోట్లుగా ఉంది. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ రహస్యాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కఠిన చర్యలు ఎదురవడంతో స్విస్ బ్యాంకుల్లో నిధులు దాచుకునే విషయంలో ఆయా దేశాల స్థానాలు ర్యాంకుల్లో కిందకు దిగజారుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం కూడా స్విస్ బ్యాంకుల్లోని ధనంపై చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంగా 2018 చివరి నాటికి స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న భారత్ వాటా చాలా తక్కువే.విదేశీయుల వాటాలో మనది 0.07 శాతంగా ఉంది.
టాప్ 5 దేశాలవే 50 శాతం
టాప్ 5లో ఉన్న యూకే, అమెరికా, వెస్టిండీస్, ఫ్రాన్స్, హాంకాంగ్ వాటా 50 శాతంగా ఉంది. టాప్ 10లోబహమాస్ 6వ స్థానం, జర్మనీ 7వ స్థానం, లక్సెంబర్గ్ 8వ స్థాన్, కేమ్యాన్ఐలాండ్స్ 9వ స్థానం, సింగపూర్ 10వ స్థానంలో ఉన్నాయి. ఇవి టాప్ టెన్ దేశాలే కాకుండా.. మూడింట రెండొంతుల ఖాతాలు ఈ దేశాలవే. టాప్ 15 దేశాలకు చెందిన సొమ్ము 75 శాతంగా ఉంది. టాప్ 30 దేశాల సొమ్ము 90 శాతంగా ఉంది. అంటే మిగతా దేశాల సొమ్ము కేవలం 10 శాతం మాత్రమే.
పొరుగుదేశాలు, బ్రిక్స్ దేశాల ర్యాంక్
స్విస్ ఖాతాల్లో పాకిస్తాన్ 82వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 89వ స్థానం, నేపాల్ 109వ స్థానం, శ్రీలంక 141వ స్థానం, మయన్మార్ 187వ స్థానం, భూటాన్ 193వ స్థానంలో ఉన్నాయి. ఈ మన పొరుగు దేశాల్లోకెల్లా పాకిస్తాన్ నుంచి అంతకుముందు నాలుగేళ్లతో పోలిస్తే గత ఏడాది తక్కువ జమ అయింది. బ్రిక్స్ దేశాల్లో భారత్ (74వ స్థానం) చివరి స్థానంలో ఉంది. బ్రిక్స్ దేశాల్లో రష్యా 20వ స్థానంలో, చైనా 22వ స్థానంలో, సౌత్ ఆఫ్రికా 60వ స్థానంలో, బ్రెజిల్ 65వ స్థానంలో ఉన్నాయి.
భారత్ కంటే ఈ దేశాలు ముందే..
మారిషస్ (71), పిలిప్పీన్స్ (54), వెనెజులా (53), సేచెల్స్ (52), థాయ్లాండ్ (39), టర్కీ (30), ఇజ్రాయెల్ (28), సౌదీ అరేబియా (21), పనామా (18), ఇటలీ (15), ఆస్ట్రేలియా (13), యూఏఈ (12), గాన్సీ (11) వ స్థానంలో ఉన్నాయి. కాగా, 2018లో భారతీయుల సొమ్ము 6 శాతం పడిపోయి 955 మిలియన్ స్విస్ ఫ్రాన్స్కు చేరుకున్న విషయం తెలిసిందే.