కేంద్రం గుడ్న్యూస్: పీఎం-కిసాన్ సాయం రూ.8,000కు పెంచే ఛాన్స్
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీపై విశ్వాసంతో ప్రజలు ఆయనను రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించారు. ఒక్క బీజేపీ పార్టీకే 2014 ఎన్నికల కంటే 22 సీట్లు అధికంగా వచ్చాయి. దీంతో మోడీపై ప్రజలు మరోసారి గతంలో కంటే అధిక విశ్వాసం కనబరిచారు. బీజేపీ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భవ, పీఎం కిసాన్ యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు సామాన్యుల కోసం తీసుకు వచ్చారు. పీఎం కిసాన్ యోజన స్కీంలో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి మూడు విడతల్లో.. విడతకు రూ.2 వేల చొప్పున, మొత్తం రూ.6,000 ఇస్తారు. ఇది రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించే పథకం.
PM కిసాన్ నిధి: ప్రతి రైతుకు లబ్ధితో పాటు వీరికి ప్రయోజనాలు.. ఇవీ
పీఎం-కిసాన్ స్కీం మరో రూ.2వేలు పెంచే ఛాన్స్
పీఎం-కిసాన్ పథకం కింద ఇప్పుడు ప్రతి రైతుకు రూ.6వేలు ఇస్తుండగా, దానిని రూ.8,000 చేయాలని మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఈ పథక విస్తరణకు, కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో కేటాయింపులు జరపవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం ఈ అంచనా ఏడాదికి రూ.87,000 కోట్లుగా ఉంది. 2019-20 మధ్యంతర బడ్జెట్లో దీనికి రూ.75,000 కోట్లు కేటాయించారు. ఇది మరో రూ.12,000 కోట్లు పెరగనుంది.
పెంపుకు మద్దతు
పిఎం-కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని పెంచాలనే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికకు పలువురి మద్దతు లభిస్తోందట. పీఎం కిసాన్ పథకం పెట్టుబడిని పెంచేందుకు ప్రభుత్వం ప్రకటన చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సాయం రూ.6,000 నుంచి రూ.8,000 పెరిగితే 2024 నాటికి ద్రవ్య లోటు 3 శాతానికి తగ్గుతుందన్నారు. అలాగే, రైతులకు మరింత మనోధైర్యాన్ని ఇచ్చినట్లవుతుందన్నారు.
త్వరలో ఎన్నికలు
ఇదిలా ఉండగా, త్వరలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు ముందే దీనిపై ప్రకటన రావొచ్చునని చెబుతున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా రైతుల కోసం మరింత దృష్టి సారించిందని చెబుతున్నారు. ఈ స్కీం కోసం రైతుల రిజిస్ట్రేషన్ అంశంపై కన్నేశారు. ఏ స్థాయిలోను, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా ఢిల్లీ నుంచే అధికారులు సమీక్షిస్తున్నారట.
ఈ పథకంలో చేరందుకు రైతుల నుంచి విజ్ఞప్తులు
సాధ్యమైనంత మంది రైతులను ఈ పథకంలో చేర్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల ఈ పథకంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేరలేదు. అయితే ఈ పథకంలో చేరని బెంగాల్ వంటి రాష్ట్రాలకు చెందిన రైతుల నుంచి ఈ పథకంలో ఎలా చేరాలో చెప్పాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయకుంటే తాము నిస్సహాయులమేనని సీనియర్ అగ్రికల్చర్ మినిస్ట్రీ అధికారి చెప్పారు.