జెట్ఎయిర్వేస్లో 75శాతం వాటాను దక్కించుకునేందుకు ఉద్యోగుల కన్సార్టియం ఆది గ్రూప్ ప్రయత్నం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్టియం మరియు ఆదిగ్రూప్, ఎన్సిఎల్టి ప్రక్రియ ద్వారా 75 శాతం వాటాను వేలం ద్వారా కొనుగోలు చేసేందుకు భాగస్వామ్యం ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సిఎల్టి) కు చెందిన ముంబై బెంచ్ జూన్ 20 న 26 మంది రుణదాతల తరఫున ఎస్బిఐ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను విచారణకు అంగీకరించింది. దీంతో దివాలా తీసిన మొదటి దేశీయ విమానయాన సంస్థగా జెట్ ఎయిర్వేస్ అవతరించింది.
ఇప్పటి వరకు జెట్ ఎయిర్వేస్ సంస్థ రూ.8500 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా.. మరో 25 వేల కోట్ల రూపాయలు అరియర్స్ రూపంలో ఆ సంస్థ వెండర్స్కు ఇతర సిబ్బందికి చెల్లించాల్సి ఉంది. అయితే జెట్ ఎయిర్వేస్ సంస్థను తిరిగి దక్కించుకునేందుకు ఆదిగ్రూప్ మరియు ఉద్యోగుల కన్సార్టియం ముందుకు రావడం శుభపరిణామం. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఒక ఎయిర్లైన్ సంస్థను ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కాపాడుకోవడం విమానాయాన చరిత్రలోనే ఇది తొలిసారి. అంటే ప్రతి ఉద్యోగి జెట్ ఎయిర్లైన్స్ సంస్థ ఓనరే అన్నమాట.
ఇక జెట్ ఎయిర్వేస్ సంస్థ ఉద్యోగులు ఆ సంస్థను టేకోవర్ చేసే ప్రయత్నం చేస్తే...ప్రధాని కల అయిన సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నిజం చేసినట్లు అవుతుందని ఉద్యోగులు ఆదిగ్రూప్ కన్సార్టియం చెప్పింది. జెట్ ఎయిర్వేస్ను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నం హర్షించదగ్గ విషయం అని బోయింగ్ 777 కమాండర్ సీనియర్ పైలట్ కెప్టెన్ అశ్వని త్యాగి తెలిపారు. ఈయన పైలట్ సంక్షేమ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. జెట్ ఎయిర్వేస్లో 18 ఏళ్ల పాటు పనిచేసిన అశ్వని త్యాగి... ఈ సంస్థలోని సిబ్బంది తన కుటుంబంతో సమానమని అన్నారు.