ఉద్యోగాలు, స్వదేశీ ఉత్పత్తులు, రైతులు.. బడ్జెట్పై ఆరెస్సెస్ సిద్ధాంత ముద్ర!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ పైన అన్ని రంగాల వారు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. వ్యాపారులు, ఆదాయపన్ను, పరిశ్రమలు.. ఇలా అన్నిరంగాల వారు తమకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారి కంటే రెండోసారి మరింత మెజార్టీతో విజయం సాధించింది. సుస్థిర ప్రభుత్వం ఉండటంతో దేశ అభివృద్ధి కాంక్షించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి అవకాశంగా చాలామంది భావిస్తున్నారు. మోడీ-2 ప్రభుత్వంలో పార్టీ సిద్ధాంతాల అమలు ఎక్కువగా ఉండవచ్చునని భావిస్తున్నారు.
బడ్జెట్లో తీపికబురు ఉంటుందా? జీరో ట్యాక్స్ అయినా ITR ఫైల్ చేయాలి
బడ్జెట్లో RSS పాత్ర
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS) సదాశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ బడ్జెట్ తయారు చేస్తున్నారట. ఇప్పటికే ఆరెస్సెస్ కూడా కొన్ని అంశాలను ప్రధానికి విన్నవించింది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థలైన స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM), భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS), భారతీయ కిసాన్ సంఘ్ (BKS), లఘు ఉద్యోగ్ భారతీ (LUB) సంస్థల ప్రతినిధులు జూన్ 15న నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు, చిన్న పరిశ్రమలకు ఉపాధి, ఉద్యోగాల వంటి అంశాలపై దృష్టి సారించే విధంగా సూచనలు చేశారట.
రైతులకు మరింత అనుకూలంగా బడ్జెట్
రైతులకు అన్నివిధాలుగా అండగా ఉండేలా ప్రభుత్వ బడ్జెట్ ఉండాలని, వ్యవసాయ సంబంధ పరికరాలు, వస్తువులపై జీఎస్టీ ఎత్తివేయాలని, అలాగే, వ్యవసాయ రుణాలు రైతులకు మరింత సులభతరం చేసేందుకు ఏకరీతి విధానాన్ని రూపొందించాలని భారతీయ కిసాన్ సంఘ్.. నిర్మలా సీతారామన్ను కోరారు. BKS నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ దినేష్ కులకర్ణి ఓ ఇంగ్లీష్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ... ప్రభుత్వం గతంలో 22,000 లోకల్ మార్కెట్స్ను స్థానిక మార్కెట్లను బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించిందని, కానీ గ్రౌండ్ లెవల్లో అది కనిపించడం లేదని, దీనిపై సమీక్షించాలన్నారు.
దిగుమతులు.. కాదు ఉత్పత్తి కావాలని BKS
పప్పుదినుసుల దిగుమతులు పెంచకూడదని BKS కోరుకుంటోంది. ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల టన్నుల వరకు పప్పుదినుసుల్ని దిగుమతి చేసుకుంటోందని, దీనిని 4 లక్షల టన్నులకు పెంచాలనే ప్రతిపాదనలు పరిశీలిస్తోందని, కానీ దిగుమతులు వద్దని, రుతుపవనాలు వచ్చే వరకు వేచి చూడాలని, మన ఉత్పత్తి పెరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.
ఉద్యోగాల కల్పన కోసం స్వదేశీ జాగరణ్ మంచ్
స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM) ప్రభుత్వ ఉద్యోగా కల్పనకు పెద్ద పీట వేయాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం, దేశీయ ఉత్పత్తు పెంపుదలకు పెద్ద పీట వేయాలని చెబుతోంది. స్వదేశీ జాగరణ్ మంచ్ లక్ష్యమే.. స్వదేశీ ఉత్పత్తుల ప్రమోషన్. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉద్యోగ కల్పనకు కృషి చేయాలని కోరుకుంటోంది.
కార్మికుల వేతనాల కోసం BMS
పారిశ్రామికవృద్ధికి అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగడం లేదని భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆందోళన వ్యక్తం చేసింది. నాణ్యత లేని ఉద్యోగ కల్పన దేశంలో తలసరి వేతనాన్ని తగ్గించిందని పేర్కొంది. లఘు ఉద్యోగి భారత్(LUB) నేషనల్ ప్రెసిడెంట్ జితేంద్ర గుప్త మాట్లాడుతూ... సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, సెల్ఫ్ రిలయన్స్ పైన దృష్టి సారించాలని సూచించారు. కాగా, సాధారణంగా ఆయా పార్టీల అనుబంధ సంస్థలకు భిన్నంగా ఆరెస్సెస్ లేదా బీజేపీ అనుబంధ సంస్థలు.. దేశాభివృద్ధి ధ్యేయంగా సూచనలు చేస్తుంటాయని చెబుతుంటారు.