అన్ని రకాల నాణేలు తీసుకోవాలి: ప్రజలకు, బ్యాంకులకు ఆర్బీఐ
ముంబై: చలామణిలో ఉన్న అన్ని రకాల నాణేలు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం మరోసారి స్పష్టం చేసింది. అందరు కూడా నాణేల చెల్లుబాటుపై తమ అనుమానాలు పక్కన పెట్టాలని సూచించింది. రెగ్యులర్ సర్క్యులేషన్లో ఉన్న అన్ని రకాల డినామినేషన్ నాణేలు చెల్లుబాటు అవుతాయని పునరుద్ఘాటించింది.
కేంద్ర ప్రభుత్వం ఆదీనంలోని మింట్ ముద్రించిన నాణేలను ఆర్బీఐ సర్క్యులేట్ చేస్తుంది. వివిధ రకాల నాణేలు విడుదల చేస్తోంది. నాణేలు ఎక్కువకాలం చలామణిలో ఉంటున్నాయి. అయితే కొన్ని రకాల నాణేలను కొంతమంది వ్యాపారులు, బ్యాంకుల శాఖలు ఆమోదించడం లేదనే వార్తల నేపథ్యంలో ఆర్బీఐ స్పందించింది.
ప్రస్తుతం 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10 విలువ కలిగిన నాణేలు చలామణిలో ఉన్నాయి. ఇందులో రూ.10 నాణేలను తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో అంగీకరించడం లేదని ఎప్పటికి అప్పుడు వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని బ్యాంకుల శాఖలు కూడా తక్కువ డినామినేషన్లలో ఉండే నాణేలనూ తీసుకోవడం లేదు.
రూ.40కే పెట్రోల్ విక్రయిస్తున్న హైదరాబాద్ ఇంజినీర్!
దీంతో కాలానుగుణంగా ఎప్పటికపుడు తాము జారీ చేసిన అన్ని రకాల నాణేలను బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు అంగీకరించాలని ఆర్బీఐ తాజాగా మరోసారి పేర్కొంది. కొన్ని నాణేలను పలువురు ట్రేడర్స్, షాప్ కీపర్స్, కొందరు ప్రజలు అంగీకరించడం లేదని తెలిసిందని, నాణేలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ వాటిని అమోదించాలని చెబుతున్నారు.
నాణేలు చెల్లవనే ప్రచారాన్ని విశ్వసించవద్దని ఆర్బీఐ ప్రజలకు సూచించింది. ఏ డినామినేషన్ నాణేముతో అయినా ఎలాంటి సంకోచం లేకుండా తమ లావాదేవీలను కొనసాగించవచ్చునని తెలిపింది. బ్యాంకులు కూడా చలామణిలో ఉన్న అన్ని నాణేలను అంగీకరించాలని ఆర్బీఐ ప్రత్యేకంగా కోరింది.