ఆటోమొబైల్స్పై జీఎస్టీ తగ్గిస్తే మంచిది!: ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ పైన జీఎస్టీ తగ్గించడం ద్వారా అది ఇండియన్ ఎకానమీకి హెల్ప్ అవుతుందని మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర అన్నారు. చిన్న కంపెనీలు, ఉపాధి కల్పనపై ఆటోమొబైల్ రంగం పెను ప్రభావం చూపుతుందన్నారు.
ఇటీవల బీఎస్ 6 పేరుతో ఓ సదస్సు జరిగింది. అందులో ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స అసోసియేషన్స్ (FADA) మాజీ అధ్యక్షుడు జాన్ కే పాల్ మాట్లాడుతూ... దేశంలో మూడో వంతు ఉద్యోగాలు సృష్టించే ఆటోమొబైల్ రంగం మళ్లీ వృద్ధి దిశగా పయనించాలంటే వాహనాలపై జీఎస్టీ తగ్గించాల్సిన అవసరముందన్నారు. దీనిని ఓ మేగజైన్ ట్వీట్ చేసింది. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.
మనమంతా మౌంట్ మందర కోసం వెతుకుతున్నామని, ఇది దేశ ఆర్థిక వృద్ధికి ఎంతో ముఖ్యమైనదని, వేగవంతమైన వృద్ధికి ఇది అవసరమని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. నేను బయాస్డ్గా ఉండవచ్చునని, కానీ ఆటో ఇండస్ట్రీ మౌంట్ మందర వంటిదన్నారు. ఇది చిన్న కంపెనీలతో పాటు ఉద్యోగాల కల్పనపై ప్రభావం చూపుతుందన్నారు. జీఎస్టీ తగ్గిస్తే ఇది ఎంతో హెల్ప్ అవుతుందన్నారు.
జగన్ ఆందోళన!: భారీగా పెరిగిన ఆంధ్రప్రదేశ్ అప్పులు
కాగా, ఇటీవల సియామ్ కూడా వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని కోరింది. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మే నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఇరవై శాతంకు పైగా తగ్గాయి. దాదాపు గత రెండు దశాబ్దాల్లో ఇంత పెద్ద శాతంలో విక్రయాలు తగ్గడం ఇదే తొలిసారి. అంతక్రితం 2001 సెప్టెంబరులో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 21.91 శాతం తగ్గాయి.