ముంబైలో ఎకరాకు రూ.745 కోట్లకు జపాన్ కంపెనీ బిడ్
ముంబై: సాధారణంగా ఎకరం ధర ఎంత ఉంటుంది.. మనకు తెలిసి రూ.5 లక్షల నుంచి పదుల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఆయా ప్రాంతం, గ్రామం, నగరాన్ని బట్టి ధర ఉంటుంది. అయితే ఏకరా భూమికి రూ.745 కోట్ల ఎక్కడైనా విన్నారా? మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మూడు ఎకరాల భూమికి జపాన్కు చెందిన ఓ ఎంఎన్సీ కంపెనీ రూ.2,238 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధమైందట.
ఏడాదికి రూ.60 లక్షల సంపాదన, సమోసా వ్యాపారికి ట్యాక్స్
రియల్ ఎస్టేట్ హిస్టరీలో రికార్డ్
జపాన్కు చెందిన సుమితోమో కంపెనీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో మూడెకరాల భూమిని రూ.2,238 కోట్లతో కొనుగోలు చేసేందుకు బిడ్ దాఖలు చేసింది. అంటే ఎకరం విలువ రూ.745 కోట్లు. ఎకరం ధర విషయంలో రియల్ ఎస్టేట్ హిస్టరీలో దేశంలో ఇది కూడా ఒక రికార్డ్ అంటున్నారు. స్థిరాస్థి చరిత్రలో అత్యంత విలువైన ఒప్పందాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA) అధికారి ఒకరు మాట్లాడుతూ... ఈ భూమి కోసం సుమితోమో కంపెనీ ఒక్కటే బిడ్ దాఖలు చేసిందని, ఈ బిడ్ ప్రాసెసింగ్ సాగుతోందని చెప్పారట.
2010లో ఎకరాకు రూ.653 కోట్లు
కంపెనీ నుంచి ప్లాట్ కొనుగోలుకు తమకు బిడ్ వచ్చిందని, దీనిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవలసి ఉందని, బిడ్ను ఎప్పుడు ఫైనలైజ్ చేస్తామనేది తెలియదని, నిర్ణీత కాలమంటూ ఏమీ పెట్టుకోలేదని అధికారులు చెబుతున్నారు. అంతకుముందు, 2010లో లోద్రా గ్రూప్ వడాలలో ఎకరాకు రూ.653 కోట్ల చొప్పున... 6.2 ఎకరాలకు రూ.4,050 కోట్ల బిడ్ దాఖలు చేసింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ముంబైలో ప్రముఖ వాణిజ్య హబ్. భూముల విలువ విషయంలో నారిమన్ పాయింట్, కఫ్ పరేడ్ తర్వాత స్థానంలో ఉంది.
సుమితోమో బిడ్
ప్రస్తుతం విక్రయానికి పెట్టిన మూడు ఎకరాల భూమి జియో గార్డెన్ పక్కన ఉందని అధికారులు తెలిపారు. నిజానికి ఈ భూమిని గతంలోనే అధికారులు విక్రయానికి పెట్టారు. అయితే అప్పులు, నగదు కొరత వంటి కారణాల వల్ల దేశీయ కొనుగోలుదారులు ఎవరూ ఆసక్తి చూపలేదు. తాజాగా మరోసారి అధికారులు ప్రయత్నించారు. ఈసారి సుమితోమో ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. ఇప్పుడు అది పరిశీలన దశలో ఉంది. అన్ని అనుమతులు రాగానే భూకేటాయింపు చేస్తామని ఓ అధికారి చెప్పారు. ఇటీవల కాలంలో ముంబైలో చోటుచేసుకున్న రెండో అతిపెద్ద ఒప్పందం ఇదేనని తెలుస్తోంది.
బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో పెరుగుతున్న వ్యాల్యూ
బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో విలువ ఏటికేడు పెరుగుతోంది. 1975లో స్క్వేర్ యాడ్కు రూ.3,000, 1980లో రూ.6,000, 1985లో రూ.8,000, 1995లో రూ.25,000, 2000లో రూ.40,000, 2010లో రూ.1.5 లక్షలు, 2016లో రూ.3 లక్షలుగా ఉంది. 2010లో లోద్రా గ్రూప్ 6.2 ఎకరాలకు రూ.4,050 అంటే ఎకరాకు రూ.653 కోట్లు, 2007లో TCG అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హీరానందని గ్రూప్ 2 ఎకరాలకు రూ.1,041 కోట్లు అంటే ఎకరాకు రూ.520 కోట్లు, 2007లో వాద్వా గ్రూప్ 2 ఎకరాలకు రూ.831 కోట్లు, 2006లో 18 ఎకరాలకు రూ.1,104 కోట్లు అంటే ఎకరాకు రూ.62 కోట్లు.