జగన్ ఆందోళన!: భారీగా పెరిగిన ఆంధ్రప్రదేశ్ అప్పులు, కేంద్రం మాట ఇదీ....
ఢిల్లీ: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని, అప్పుడు రూ.90వేల కోట్లుగా ఉన్న రుణాలు, ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు దాటాయని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. సీఎం జగన్ కూడా నీతి అయోగ్ సమావేశంలో, పలు సందర్భాల్లో కేంద్రం సహకరించకుంటే ముందుకు వెళ్లలేమన్నారు. కేంద్రం సహకారం లేకుంటే ఆర్థిక సంక్షోభం ఉంటుందని ఆర్థికమంత్రి బుగ్గన కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ఇందులో ఏపీకి నాలుగేళ్లలో పెరిగిన అప్పులు, ఏ సంవత్సరం ఎంత పెరిగిందో చెప్పారు.
రెండేళ్లలో 35 శాతం పెరిగిన అప్పులు
నిర్మలా సీతారామన్ చెప్పిన ప్రకారం... 2015-2017 మధ్య రెండేళ్ల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పులు 35 శాతం పెరిగాయి. రూ.1,48,743 కోట్లుగా ఉన్న అప్పులు, రూ.2,01,314 కోట్లు అయ్యాయి. 2018-19 రాష్ట్ర బడ్జెట్ అంచనాల నాటికి మిగిలి ఉన్న రుణం రూ.2,49,435 కోట్లు. గత మూడేళ్లలో రుణం భారీగా పెరిగింది. నాలుగేళ్లలో అప్పులు 67 శాతం పెరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య విభజించని అప్పు రూ.23,438 కోట్లుగా ఉంది. 2015 మార్చి నాటికి నవ్యాంధ్ర రుణం రూ.1,48,743గా ఉంటే, 2017 మార్చి నాటికి ఇది రూ.2,01,314గా ఉంది.
FRBM పరిమితికి మించి రుణ సేకరణకు అనుమతి
2016-17 ఆర్థిక సంవత్సరంలో ఉదయ్ స్కీం కింద రూ.8,256 కోట్ల అదనపు రుణ సేకరణకు, డిస్కంల రుణాలను టేకోవర్ చేయడానికి వీలుగా ఈ ఒక్క సంవత్సరానికి FRBM పరిమితికి మించి రుణసేకరణకు అనుమతి ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ పద్దులు, ఆడిట్ ఖాతాల ప్రకారం గత మూడేళ్లలో ఏపీ రుణాలు, వాటిపై చెల్లించే వడ్డీలు భారీగా ఉన్నాయి. రుణవృద్ధి 2015-16తో పోలిస్తే 2016-17నాటికి 35% పెరిగింది. ఆ తర్వాత 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధిరేటు వరుసగా 11%, 10%గా ఉంది.
ఏ సంవత్సరంలో ఎన్ని కోట్ల అప్పులు?
ఏపీ అప్పులు 2014-15 (మార్చి నాటికి) రూ.1,48,743 కోట్లు, 2016-17 నాటికి రూ.2,01,314 కోట్లు, 2017-18 నాటికి రూ.2,25,234 కోట్లు, 2018-19 నాటికి రూ.2,49,435 కోట్లుగా ఉంది. 2016-17లో వడ్డీ, రుణ చెల్లింపులు రూ.12,292 కోట్లు, 2017-18లో రూ.14,756 కోట్లు 2018-19లో రూ.15,077 కోట్లుగా ఉంది.
ఏపీకి కేంద్రం ఎంత ఇచ్చింది?
విభజన చట్టంలోని హామీల అమలు కోసం ఏపీకి 2016-17 నుంచి 2018-19 మధ్యకాలంలో రూ.7,907 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. విభిన్న పద్దుల కింద కేంద్రం నుంచి రూ.50,372.93 కోట్లు విడుదలైంది. రెవెన్యూ లోటు కింద 2016-17లో రూ.1,176 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు, రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ.450 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2,514 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత 2017-18లో పోలవరం ప్రాజెక్టుకు రూ.2,000 కోట్లు, 2018-19లో రూ.1,400 కోట్లు ఇచ్చింది. ప్రత్యేక ప్యాకేజీ కింద విదేశీ రుణ, వడ్డీ చెల్లింపుల కింద రూ.15.81 కోట్లు ఇచ్చింది. మొత్తంగా 2016-17లో రూ.4,491.20 కోట్లు, 2017-18లో రూ.2,000 కోట్లు, 2018-19లో రూ.1,415.81 కోట్లు ఇచ్చింది.
దర్శన్ స్కీం
ఇదిలా ఉండగా, నెల్లూరు కోస్టల్ సర్క్యూట్ అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా స్వదేశ్ దర్శన్ స్కీం కింద 2015-16లో రూ.59.70 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ వేరుగా చెప్పారు. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద నెల్లూరు, పులికాట్ సరస్సు, ఉబ్లమడుగు జలపాతం, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, కొత్తకోడూరు బీచ్, మైపాడు బీచ్, రామతీర్థం, ఇస్కపల్లిని అభివృద్ధి చేస్తామన్నారు.. 75 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయన్నారు.