మా దేశం నేరగాళ్లకు అడ్డాకాదు: మెహుల్ చోక్సీకి ఆంటిగ్వా షాక్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలోని ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహుల్ చోక్సీకి ఆంటిగ్వా ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. నకిలీ పత్రాలతో రుణాలు పొంది రూ.13,500 కోట్లకు పైగా PNB స్కాంలో నీరవ్ మోడీతో పాటు అతను కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చోక్సీకి తమ దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆంటిగ్వా ప్రభుత్వం నిర్ణయించింది.
చోక్సీ పౌరసత్వంపై విచారణ చేపట్టామని, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసి భారత్కు అప్పగించే చర్యలు చేపడతామని ఆంటిగ్వా ప్రధాని గాస్టోన్ బ్రౌన్ తెలిపారు. ఆర్థిక నేరగాళ్ళకు తమ దేశం సురక్షిత స్థావరం ఏమీ కాదని, అలాంటి వారికి తమ దేశం రక్షణ కల్పించదని చెప్పారు.
ఆర్థిక నేరాల్లో పాలుపంచుకున్న నేరగాళ్లకు అంటిగ్వాను సురక్షిత ప్రదేశంగా మార్చే ప్రసక్తే లేదన్నారు. కాగా, PNB స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటూ దేశం విడిచి అంటిగ్వాలో తలదాచుకున్న చోక్సీ అప్పగింత ప్రక్రియ ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది. చోక్సీ తన వాదనను సమర్ధించుకోవడంలో విఫలమై, న్యాయ ప్రక్రియలో చేతులెత్తేసిన అనంతరం ఆయనను అప్పగిస్తామని హామీ ఇస్తున్నామని అంటిగ్వా ప్రధాని చెప్పారు.
జీతాలు చెల్లించలేం: చేతులెత్తేసిన బీఎస్ఎన్ఎల్!నష్టాల కారణాలు
మెహుల్ చోక్సీ గత ఏడాది జనవరిలో దేశం నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆరు నెలలకు ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నాడు. ఈ స్కాం ఫిబ్రవరిలో వెలుగు చూసింది. అంతకుముందే అతనికి ఆంటిగ్వా పౌరసత్వం వచ్చింది. అతనిని అప్పగించాలని భారత్ కోరడంతో... అతనికి వ్యతిరేకంగా ఉన్న క్రైమ్ వివరాలు ఇవ్వాలని ఆంటిగ్వా కోరింది.
అతని పంపించేందుకు ప్రాసెస్ కొనసాగుతుందని, అతనికి సంబంధించిన వ్యవహారం కోర్టు ముందు ఉందని, తాము భారత ప్రభుత్వానికి ఒక విషయం చెప్పామని, క్రిమినల్స్కు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయని, అలాగే, తన పరిస్థితిపై చోక్సీకి కూడా కోర్టుకు వెళ్లే అవకాశముందని ఆంటిగ్వ ప్రధాని చెప్పారు. భారత్కు హామీ ఇస్తున్నానని, చట్టపరమైన ప్రక్రియ ముగిసిన అనంతరం అప్పగిస్తామన్నారు.
కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీని అప్పగించాలన్న భారత్ పిటిషన్ను బ్రిటన్ కోర్టులో ఎదుర్కొంటున్నారు. నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్లను బ్రిటన్ కోర్టులు పలుమార్లు తిరస్కరించాయి.