RAI విజ్ఞప్తికి ఓకేనా?: రూ.2,000 వరకు దుస్తులపై జీఎస్టీ తగ్గించే ఛాన్స్!
న్యూఢిల్లీ: గార్మెంట్స్ దుకాణదారులకు జీఎస్టీ ఊరట లభించనుందా? అంటే అవుననే అంటున్నారు. అయితే అన్నింటి పైన కాకుండా రూ.2,000 ధర లోపు ఉన్న దుస్తుల పైన ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండగా, 5 శాతం జీఎస్టీ శ్లాబ్లోకి తీసుకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు చేసారు. వారి విజ్ఞప్తిని ఆమె అంగీకరిస్తే జీఎస్టీ తగ్గే అవకాశముంది.
అన్ని రకాల రిటర్న్స్కు ఒకే ఫామ్!
రూ.1,000 దుస్తుల పైన 5 శాతంగా ఉన్న జీఎస్టీని రూ.2,000కు పెంచాలని RAI కోరిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు వెయ్యి రూపాయలకు పైన విలువ కలిగిన దుస్తులు, అప్పారెల్స్ పైన 12 శాతం జీఎస్టీ ఉంది. కేంద్ర బడ్జెట్లో దీనిని ప్రస్తావించనప్పటికీ, కేంద్ర ఆర్థికమంత్రి లేదా ప్రభుత్వం తమ ఉద్దేశ్యాన్ని తెలియజేయవచ్చునని చెబుతున్నారు. జీఎస్టీ కౌన్సెల్, ఫిట్మెంట్ కమిటీ సమీక్ష కోసం పరిగణలోకి తీసుకోవచ్చునని అంటున్నారు.
అదే విధంగా, రిటైలర్స్కు క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్ చవక, సులభతరంగా ఉండేలా చేయాలని RAI కోరింది. ఇలా చేయడం ద్వారా డిజిటలైజేషన్కు మరింత ఊతమిచ్చినట్లుగా అవుతుందని తెలిపారు.
కాగా, ఇటీవల 35వ జీఎస్టీ మండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం దృవీకరణ పత్రంగా ఆధార్ తీసుకోవటం , యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ కాలపరిమితి పొడిగింపు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వెలువరించింది. యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ కాలపరిమితిని రెండేళ్ల పాటు పొడిగింపించింది.
జీఎస్టీ రేట్ల తగ్గింపును వినియోగదారులకు బదలాయించకుండా కంపెనీలు లబ్ధి పొందిన మొత్తంలో 10 శాతం వరకు జరిమానాను విధించేందుకు ఆమోదం తెలిపిందన్నారు.మరోవైపు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలు గడువు తేదీని ఈ ఏడాది ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అంతే కాక ఉత్పత్తుల రవాణా కోసం ఈ-వే బిల్లులు సృష్టించి వరుసగా రెండు నెలలు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారు కూడా తమ రిటర్నులను ఆగస్టు 21 వరకు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.