జీతాలు చెల్లించలేం: చేతులెత్తేసిన బీఎస్ఎన్ఎల్, మనుగడ ప్రశ్నార్థకం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి కంపెనీకి చెందిన ఇంజినీర్స్, అకౌంటెంట్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కోరింది. సంస్థకు తక్కువ స్థాయిలో అప్పులు ఉన్నాయని, మార్కెట్ వాటా కూడా క్రమంగా పెరుగుతోందని, నగదు కొరత కారణంగా సంస్థ కార్యకలాపాలు, సర్వీసుల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సంస్థకు బడ్జెట్ పరంగా మద్దతివ్వాలని కోరింది. కేంద్రం సహకరించకుంటే జూన్ నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు అని తెలిపింది. బాకీలు వేల కోట్లు ఉన్నందున వేతనాల కోసం రూ.850 కోట్లు సేకరించడం కష్టమన్నారు. ఈ మేరకు 18వ తేదీన లేఖ రాసింది.
చైనాతో ట్రేడ్ వార్: అమెరికన్లపై 12.2 బిలియన్ డాలర్ల భారం
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రధానికి రాసిన లేఖలో సంస్థ పరిస్థితిని వివరించింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక మద్దతు లభిస్తే ప్రస్తుతం ఉన్న నగదు కొరత సమస్య తీరుతుందని పేర్కొంది. దీంతో బీఎస్ఎన్ఎల్ తిరిగి లాభాలబాట పడుతుందని తెలిపింది. ఉద్యోగుల పనితీరు ఆధారిత విధానాన్ని అమలు చేయాలని, దీంతో మంచి పనితీరు కనబరిచిన వారికి ప్రతిఫలం అందుతుందని, జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంది. ప్రయివేటు రంగంలోని టెలికం సంస్థల నుంచి పోటీ ఎదురుకావడంతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లు చాలాకాలం నష్టాలు చవిచూశాయి.
13,000 కోట్ల అప్పులు
కంపెనీకి రూ.13,000 కోట్ల రుణాలు ఉన్నాయి. ఖర్చుకు తగిన ఆదాయం రావడం లేదు. ఎక్కువ నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో బీఎస్ఎన్ఎల్ టాప్లో ఉందట. కొటక్ ఇనిస్టిట్యూషన్స్ ఈక్విటీ నివేదిక ప్రకారం... డిసెంబర్ 2018 నాటికి నిర్వహణ నష్టాలు రూ.90,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇలాగే ఉంటే కంపెనీ నిర్వహణ, ఉద్యోగులకు రూ.850 కోట్ల వేతనాలు కష్టమని చెబుతున్నారు.
చివరిసారి నెట్ ప్రాఫిట్ రూ.575 కోట్లు
చివరిసారి 2008-09లో బీఎస్ఎన్ఎల్ నెట్ ప్రాఫిట్ రూ.575 కోట్లుగా ఉంది. 2013-14లో బీఎస్ఎన్ఎల్ రెవెన్యూ రూ.26,153 కోట్లు కాగా, నష్టం రూ.7,020 కోట్లు, 2014-15లో రెవెన్యూ రూ.27,242 కోట్లు, నష్టం రూ.8,234 కోట్లు, 2015-16 రెవెన్యూ రూ.28,381, నష్టం రూ.4,859, 2016-17లో రెవెన్యూ రూ.28,404 కోట్లు, న,్టం రూ.4క,793 కోట్లు, 2017-18లో రెవెన్యూ రూ.22,668 కోట్లు, నష్టం రూ.7,993 కోట్లుగా ఉంది. మొత్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి డెబిట్స్ రూ.14,000 కోట్లుగా ఉన్నాయి.
ఉద్యోగుల వేతనాలు, బెనిఫిట్స్ ఎక్కువ
అయితే బీఎస్ఎన్ఎల్కు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి పునరుద్ధరణ చర్యలు లేవని అంటున్నారు. ఉద్యోగి వేతనాలు, బెనిఫిట్స్ ఎక్కువగా ఉండటం, పేలవమైన నిర్వహణ పనితీరు, 4G నెట్ వర్క్ విస్తరణలో జాప్యం వంటి అంశాలు కంపెనీని దెబ్బతీశాయని అంటున్నారు. ప్రయివేటు టెలికం కంపెనీలు 4G సేవల్లో దూసుకెళ్తూ, 5Gపై దృష్టి సారిస్తుంటే, బీఎస్ఎన్ఎల్ ఇంకా 3Gలోనే ఉంది. ఇప్పుడిప్పుడే 4G సేవలు అందిస్తోంది. ఈ కంపెనీలో 1.7 లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారం లేకుంటే నడపటం కష్టతరమని కంపెనీ అసోసియేషన్ ఆందోళన చెందుతోంది. ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు 2018లో (రిటైర్మెంట్ ఉద్యోగులు సహా) 66 శాతంగా ఉండటం గమనార్హం. ఇది 2006లో 21 శాతం మాత్రమే ఉంది. అదే సమయంలో ఎయిర్టెల్ 3 శాతం ఖర్చు చేస్తోంది.