న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలో కార్మిక రంగంలో భారీ సంస్కరణలు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కార్మికుల కోసం పలు పథకాలు తీసుకు వచ్చింది. త్వరలో ఈ పథకాలను మించిన సంస్కరణలకు శ్రీకారం చుడుతోందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో వేజ్ కోడ్ బిల్లు తీసుకురానుంది. ఈ బిల్లు కార్మికులకు కనీస వేతన హామీ ఇవ్వనుంది.

కనీస వేతన బిల్లు
ఈ బిల్లును కేంద్ర కేబినెట్ ముందు త్వరలో ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం ప్రస్తుత పార్లమెంటు సెషన్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా రైల్వే, మైనింగ్ కార్మికులకు కనీస వేతనం నిర్ణయించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. అంటే రైల్వే, గనుల వంటి నిర్దిష్ట రంగాలకు కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాలను నిర్దారిస్తుంది.

అయిదేళ్లకోసారి సమీక్ష
వేజ్ కోడ్ బిల్లును కేంద్ర కార్మిక శాఖ సిద్ధం చేసింది. ఈ వారంలో ఈ బిల్లును కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకు రానుంది. కేబినెట్ ఆమోదం కోరనుంది. వేజ్ కోడ్ బిల్లు 16వ లోకసభలో ల్యాప్స్ అయింది. దీనిని ఆగస్ట్ 10, 2017లో లోకసభలో ప్రవేశపెట్టారు. ఆగస్ట్ 21, 2017న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేశారు. ఇది తన నివేదికను డిసెంబర్ 18, 2018న సమర్పించింది. ఈ వేజ్ కోడ్ బిల్లులో సోషల్ సెక్యూరిటీ, పారిశ్రామిక భద్రత, సంక్షేమం, పారిశ్రామిక సంబంధాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఊతమిచ్చేలా ఉంటుంది. వేజెస్ పేమెంట్ యాక్ట్ 1936, మినిమం వేజెస్ యాక్ట్ 1948, పేమెంట్ బోనస్ యాక్ట్ 1965, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 చట్టాలను ఇది రీప్లేస్ చేయనుంది. బిల్లులోని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రైల్వే, మైన్స్ వంటి పలు సెక్టార్లలో కనీస వేతనాన్ని పిక్స్ చేయనుంది. మిగిలిన ఉపాధి రంగాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలను ఖరారు చేస్తాయి. బిల్లు ప్రకారం కనీస వేతనాన్ని అయిదేళ్లకోసారి సమీక్షించాలి.

సీఐఐ ఏం చెప్పందంటే
ఇదిలా ఉండగా, కనీస వేతనాలను ఖరారు చేసే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉండాలని పరిశ్రమల సంస్థ సీఐఐ స్పష్టం చేసింది. జాతీయ కనీస వేతనం ఉపాధి కల్పనపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రాష్ట్రాలే కనీస వేతనాలు నిర్ణయించాలని పేర్కొంది. ఆయా ప్రాంతాలు, నైపుణ్యం, వృత్తి ప్రాతిపదికన రాష్ట్రాలు కనీస వేతనాలను ఖరారు చేయాలని, ఈ వేతనాలు కేంద్రం నిర్ణయించే కనీస వేతనాల కంటే తక్కువగా ఉండరాదని పేర్కొంది. నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం కలిగిన కార్మికులకు మార్కెట్ శక్తులు వేతనాలు నిర్దారిస్తుండగా, నైపుణ్యం లేని కార్మికులకు ప్రభుత్వమే కనీస వేతనాలు ఖరారు చేయాలని సీఐఐ సూచించింది.


Click it and Unblock the Notifications