ఐటీఆర్ ఫైలింగ్ గడువుదాటితే జరిమానా ఎంతంటే?
హైదరాబాద్ : వేతన జీవులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను వచ్చే జూలై 31 నాటికి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ తేదీ దాటితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా రూ. 10 వేల వరకు ఉంటుంది. అయితే ఒకవేళ మీ ఆదాయం పన్ను విధించే పరిమితికన్నా తక్కువగా ఉంటే జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
జరిమానా ఎలా ఉంటుందంటే...
- ఐటీఆర్ ను నిర్దేశిత గడువులోపు ఫైల్ చేయడమే మంచిది. గడువు దాటితే జరిమానాను చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.
- గడువు దాటిన తర్వాత 2019 డిసెంబర్ 31 లోపు టాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే రూ. 5,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
- డిసెంబర్ 31 తర్వాత అసెస్ మెంట్ సంవత్సరానికి ముందుగా రిటర్న్ ఫైల్ చేస్తే రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుంది.
- ఒకవేళ స్థూల ఆదాయం రూ.5 లక్షలు దాటినా సందర్భంలో రూ.1,000.
ఎవరు జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదంటే..
- నిర్దేశిత ఆదాయం వరకు వ్యక్తులకు పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి 60 ఏళ్ల లోపు వారికి రూ. 2.5 లక్షలుగా ఉంది. సీనియర్ సిటిజన్లకు అంటే 60దాటి 80 ఏళ్ల లోపు వారికి ఆదాయ పరిమితి రూ.3 లక్షలు ఉంటుంది. 80 ఏళ్ళు దాటితే ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ.5 లక్షలుగా ఉంది.
జాప్యం ఎందుకు..
ఐటీఆర్ ను ఫైల్ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నాయి. మీరు రుణం కోసం దరఖాస్తు చేయాలన్న క్రెడిట్ కార్డు కోసం అప్లై చేయాలన్న మీ ఐటీఆర్ ఎంతో ముఖ్యమైనది. అందుకే మీరు ఉద్యోగం చేస్తుంటే కంపనీ నుంచి ఫారం -16 తీసుకొని అందులోని వివరాల ఆధారంగా ఐటీఆర్ ను ఫైల్ చేయండి. గడువులోపు ఫైల్ చేయడం వల్ల మీకే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి జూలై 31వ తేదీని మరచిపోకండి.