చెన్నై హోటళ్లలో లంచ్ బంద్? నీళ్ల కటకట ఎఫెక్ట్
తమిళనాడులో నీళ్ల కొరత రోజురోజుకీ తీవ్రమవుతోంది. గుక్కెడు నీటి కోసం జనాలు అలమటించే స్థితి ఎదురవుతోంది. ఆఫీసుల్లో కూడా నీళ్లు లేక ఉద్యోగులను ఇంట్లోనే కూర్చుని పనిచేసుకోమనే స్థితి వచ్చేసింది. ఇక హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మరీ దారుణంగా తయారయిందని హోటల్స్ అసోసియేషన్ మొత్తుకుంటోంది. వంటలు వండడం ఒక కష్టంగా ఉంటే.. సదరు పాత్రలను, తిన్న కంచాలు, గ్లాసులను కడగడం అంత కష్టంగా మారిందని లబోదిబోమంటున్నారు. వినడానికి కాస్త వింతగా ఉన్నా.. నిజంగా మనం ఆందోళన పడాల్సిన స్థాయికి చేరింది చెన్నైలో నీటి కటకట స్థితి.
మీ నీళ్లు మీరే తెచ్చుకోండి, ఇంటి నుంచి పని చేయండి: చెన్నై ఐటీ ఉద్యోగులకు షాక్!
రేట్లు ఆకాశానికి...
వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో తమిళనాడులోని వివిధ రాష్ట్రాల్లో స్థితి అధ్వాన్నంగా తయారైంది. మంచినీళ్ల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడని పరిస్థితులు ముఖ్యంగా చెన్నైలో కనిపిస్తున్నాయి. కూరగాయల రేట్లు కొండెక్కాయి. ఆహార వస్తువుల ధరలు ఆకాశానికెక్కాయి. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు గతంలో ఎప్పుడూ లేనంతగా ఓ చిత్రమైన స్థితిని ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే.. చెన్నై హోటళ్లలో మధ్యాహ్నం లంచ్ను నిలిపేయాల్సి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
''ఇప్పటికైతే కష్టపడ్తున్నాం. తమిళనాడులోని ఏ హోటల్లో కూడా ఇంకా దక్షిణాది లంచ్ను నిలిపేయలేదు. కానీ రాబోయే రోజుల్లో చాలా కష్టం. వర్షాలు పడి నీళ్లు చౌకగా దొరకపోతే నడపడం చాలా ఇబ్బంది. కూరగాయల రేట్లు బాగా పెరిగాయి'' - ఆర్. శ్రీనివాసన్, తమిళనాడు హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి.
సౌతిండియన్ లంచ్ వండలేం
సాధారణంగా దక్షిణాది వంటకాల్లో నూనె, నెయ్యి వాడకం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు పెద్ద పెద్ద పాత్రలు కావాలి. ఎక్కువ ఐటెమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని తయారు చేయడానికి, మళ్లీ ఆ వంట వండిన పాత్రలను కడగడానికి ఎక్కువ నీళ్లు కావాల్సి ఉంటుంది. అందుకే ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు రెస్టారెంట్ల యాజమాన్యాలు. తినే ప్లేట్లకు బదులు అరిటాకులు పెడదామంటే.. వర్షాల్లేక అవి పండడమే కష్టంగా మారింది. వేరే ఊళ్ల నుంచి తెప్పిద్దామంటే రేట్లు మరీ ఎక్కువగా ఉంటున్నాయని, అందుకే ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నామనేది వాళ్ల వాదన.
ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ ప్లేట్లపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం ఉండడం కూడా మరింత కష్టానికి కారణమవుతోంది.
ఒక్కో ట్యాంకర్ రూ.5 వేలు
అందుకే వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు అక్కడి రెస్టారెంట్ ఓనర్లు. ఎక్కువ ఐటెమ్స్ లేకుండా రెడీ మిక్స్డ్ సాంబార్ రైస్, కర్డ్ రైస్ వంటి వాటికి పరిమితమైతే ఖర్చుతో పాటు నీళ్ల వినియోగం కూడా బాగా తగ్గుతుందని చూస్తున్నారు. ఇక ట్యాంకర్ల విషయానికి వస్తే ఒకప్పుడు 12 వేల లీటర్ల వాటర్ ట్యాంకర్ రు.2500 ఉండేది. ఇప్పుడది రూ.5 వేలు పెట్టినా దొరకడం లేదు. సాధారణంగా ఒక్కో చిన్న రెస్టారెంట్కే సుమారు 10 వేల లీటర్ల వరకూ నీళ్లు అవసరమవుతాయి. ఈ లెక్కన నీళ్లకే నెలకు వేలకు వేలు పోయాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం చేయడం కష్టమనేది వాళ్ల వాదన.
మొత్తానికి తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో పరిస్థితి చేయిదాటిపోతోంది. నీటి కటకటకు హోటళ్లలో దక్షిణాది భోజనాన్ని కూడా ఆపేయాలని యజమానులు అనుకోవడం డేంజర్ బెల్స్ను మోగిస్తోంది. రేపు మన పరిస్థితిలో కూడా అలానే ఉండొచ్చా ? ఆలోచించండి. ఏం చేయాలో, ఏం చేయొచ్చో కామెంట్ చేయండి. షేర్ చేసుకోండి.
ఏపీ నుండి నీరు బంద్, చెన్నై నీటికష్టాలు: ఈ IT కంపెనీలు ఆదర్శం!