LIC వంటి అతి భారీ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ?
హైదరాబాద్: దేశంలో అతిపెద్ద సంస్థల రూపకల్పన దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతోంది. ఇప్పటికే బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ తో ఈ తరహా ప్రయోగం ప్రారంభం కాగా... జీవిత బీమా సంస్థ LIC తరహాలో ఒక భారీ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే ప్రభుత్వ రంగంలో ఉన్న నాలుగు సాధారణ బీమా కంపెనీలు - న్యూ ఇండియా అసురెన్సు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు, ఓరియంటల్ ఇన్సూరెన్సు , నేషనల్ ఇన్సూరెన్సులను విలీనం చేయాలనీ భావిస్తున్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి.
ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా... అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
న్యూఇండియా అసురెన్స్లో విలీనం
ఈ నాలుగు సంస్థల్లోకి పెద్దది, దేశంలోని సాధారణ బీమా కంపెనీల్లో నూ పెద్దది అయిన న్యూ ఇండియా అసురన్సు కంపెనీలో మిగతా మూడు కంపెనీలను విలీనం చేయాలన్నది ప్రభుత్వ యోచన. ఆలా చేయటం వల్ల దేశంలో ఒక అతి భారీ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ అవతరిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన పూర్తిగా కొత్తది ఏమీ కానప్పటికీ , నాలుగు కంపెనీలను విలీనం చేయాలని ఆలోచించటం మాత్రం ఇదే తొలిసారి. గతంలో న్యూ ఇండియా అసురన్సు ప్రస్తావన లేదు. ఇది మినహా మిగతా మూడు కంపెనీలని విలీనం చేసి మొత్తంగా రెండు సాధారణ బీమా సంస్థలు ఉండాలని తొలుత భావించారు.
విలీనంపై చర్చలు
కాగా, ఈ మేరకు విలీన ప్రక్రియ కోసం ఆర్థిక వ్యవహారాల శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మానేజ్మెంట్ చర్చలు ముమ్మరంగా సాగుతున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 25 ప్రైవేట్ సాధారణ బీమా కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో నాలుగు ఉండగా, 2017లో న్యూ ఇండియా అసురన్సు కంపెనీ లిస్ట్ ఐంది.
విలీన ప్రక్రియ ఎలా ఉండాలి
అయితే ఈ నాలుగు కంపెనీల విలీన ప్రక్రియ ఎలా ఉండాలి అని ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా యోచిస్తున్నారట. తొలుత మూడు UN -లిస్టెడ్ కంపెనీలను విలీనం చేయగా ఏర్పడే కొత్త కంపెనీని న్యూ ఇండియా అసురన్సు లో విలీనం చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారట. లేదంటే ఒకేసారి లిస్టెడ్ కంపెనీ ఐన న్యూ ఇండియా అసురన్సు లో విలీనం చేసి ప్రక్రియ పూర్తి చేయాలా అన్నది ఇంకా స్పష్టం కాలేదని తెలుస్తోంది.
బీజేపీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు
నరేంద్ర మోడీ నాయకత్వం లోని బీజేపీ ప్రభుత్వం రైతులకి పెన్షన్ పథకాలు, మధ్య తరగతి వర్గానికి, పేదలకు ఆరోగ్య బీమా సహా మరిన్ని నూతన బీమా ప్రయోజనాలు ప్రవేశ పెట్టె యోచలో ఉందని, అందుకే ఒక భారీ సాధారణ బీమా కంపెనీ ప్రభుత్వ రంగంలో ఉండటం ఎంతయినా అవసరం అని భావిస్తున్నట్లు సమాచారం. నాలుగు సంస్థలు ఒక దాంతో మరొకటి పోటీపడే బదులు , ఒక సంస్థగా ఉంటె లాభదాయకత పెరిగే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రభుత్వం ప్రవేశ పెట్టె అనేక పథకాలకు బీమా ప్రయోజనం కల్పించటం తేలిక అవుతుందని భావిస్తున్నలు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ కంపెనీలు కలిస్తే 42 శాతం వాటా
న్యూ ఇండియా అసురన్సు కంపెనీ మార్కెట్ వాటా సుమారు 17% ఉండగా మిగతా మూడు కంపెనీల ఉమ్మడి వాటా మరో 25% ఉంటుందట. ఈ నాలుగు సంస్థలు విలీనం అయితే , దేశంలోని సాధారణ బీమా రంగంలో 42% వాటా తో ఏర్పడే అతి భారీ జనరల్ ఇన్సురెన్సు కంపెనీ మార్కెట్లో దూసుకు పోవటం ఖాయం అంటున్నారు. కాగా, ప్రభుత్వ రంగంలోని బీమా సంస్థల నష్టాలు కొంత తగ్గి రూ 12,603 కోట్లకు చేరటంతో ప్రభుత్వమే ఉమ్మడి సంస్థకు కావాల్సిన పెట్టుబడులను సమకూర్చే యోచన ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విలీన ప్రక్రియకు నాలుగు సంస్థల ఉద్యోగులు, యూనియన్లు సహకరిస్థాయా లేదా, ప్రతిపక్షాలనుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే.