ఏపీ నుండి నీరు బంద్, చెన్నై నీటికష్టాలు: ఈ IT కంపెనీలు ఆదర్శం!
చెన్నై: చెన్నై నీటి కష్టాలు ఎదుర్కొంటోంది. పలు ఐటీ కంపెనీలు కూడా ఈ సమస్య కారణంగా.. ఉద్యోగులు తమ మంచినీళ్లు తామే తెచ్చుకోవాలని, డిస్పోజల్స్ మీరే తెచ్చుకోవాలని, ఇంటి నుంచే పని చేయాలని సూచనలు చేశాయి. వర్షాలు లేక జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటడంతో చెన్నై సహా తమిళనాడు అంతా నీటి కొరత ఎదుర్కొంటుంది. దీంతో పలు కార్యాలయాలు, హోటళ్లు క్లోజ్ అయ్యాయి. కొన్ని హోటల్స్ ఏకంగా భోజనం వండటం మానేశాయి. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు సూచనలు చేస్తూనే, ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నాయి.
ఎండిపోయిన జలాశయాలు
చెన్నైకు తాగునీరు సరఫరా చేసే పూండి, పుళన్, చోళవరం, రెడ్హిల్స్, చెంబరంబాక్కం, వీరాణం వంటి జలాశయాలు ఎండిపోయాయి. తెలుగు గంగ కింద రావాల్సిన కృష్ణా జలాలు కూడా సరఫరా కాలేదు. భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోయాయి. మరోవైపు, జలమండలి నీటి సరఫరా తగ్గించింది. ఇది ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది. చెన్నైలో రోజువారీ నీటి అవసరం 850 మిలియన్ లీటర్లు. ప్రభుత్వం 450 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. ప్రభుత్వం సరఫరా చేసే నీటిపై దాదాపు 60 లక్షలమంది ప్రజలు ఆధారపడ్డారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినా సరిపోవడం లేదు. రోజువారీ అవసరాలకు 6వేల లీటర్ల ట్యాంకర్కు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు అవుతోంది.
నీటి సమస్య పరిష్కారం కోసం రూ.500 కోట్లు
మరోవైపు, నీటి సమస్యను తగ్గించేందుకు పళనిస్వామి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయించింది. తాగునీటి ఎద్దడిపై అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదిక కోరారు. ఆయా జిల్లా అవసరాలను బట్టి నిధులు కేటాయిస్తారు. అలాగే, కర్ణాటక నుంచి కావేరీ జలాలు విడుదలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుుంటోంది. కర్ణాటక నీటిని విడుదల చేయకుంటే కేంద్ర జల సంఘాన్ని ఆశ్రయించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, కేంద్రం నుంచి కూడా రూ.5వేల కోట్లు కోరింది.
నీటిని నిలిపేసిన ఏపీ ప్రభుత్వం
చెన్నైలో జనాభా దాదాపు 75 లక్షలు. చెన్నై తాగు నీటి అవసరాల కోసం ఏపీలోని కండలేరు జలాశయం నుుంచి ప్రతి సంవత్సరం 12 టీఎంసీల నీరు తీసుకుంటున్నారు. కానీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.98 టీఎంసీల నీటిని మాత్రమే పొందారు. కండలేరులో 6.40 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే చెన్నైకి ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుంది. ప్రస్తుతం కండలేరులో 4.58 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదు. దీనికి తోడు వర్షాలు రాలేదు. జలాశయాలు ఎండిపోయాయి. ఈ అంశాలను తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి వెల్లడించారు.
చెన్నై నీటి సమస్యకు ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి
చెన్నై నీటి సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గొట్టపు బావుల ఏర్పాటు, వ్యవసాయ బావులను అద్దెకు తీసుకోవడం, పలు ఇతర తాగునీటి ఆధారాల ద్వారా చెన్నైకి 525 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి వేలుమణి తెలిపారు. ఎరుమైయూర్ రాళ్ల క్వారీ నుంచి రూ.19.17 కోట్లతో జూలై నుంచి 10 మిలియన్ లీటర్ల నీటిని పొందేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెట్టేరి, పెరుంబాక్కం, ఆయనంపాక్కం జలాశయాల నుంచి 30 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్రక్రియకు రూ.53 కోట్లతో పనులు జరుగుతున్నాయట. 900 ట్యాంకర్లతో రోజుకు తొమ్మిదివేల ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు.
ఆదర్శంగా టీసీఎస్, కాగ్నిజెంట్
నీటి సమస్య కారణంగా చెన్నైలోని OMR రోడ్డులోని ఐటీ కారిడార్లో పలు సంస్థలు కార్యాలయాల్లో నీళ్లు లేక ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులను కోరాయి. పలు ఐటీ కంపెనీల్లో క్యాంటీన్లు క్లోజ్ చేశారు. సిబ్బందిని ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని సూచించాయి. ఇదిలా ఉండగా, ఐటీ పార్క్లోని టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు మాత్రం మిగతా కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తమ కార్యాలయాల ప్రాంగణాల్లో సరిపడా నీటి నిల్వకు ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నాయి. తమకు నీటి కొరత లేదని చెప్పాయి. ఈ సంస్థలు నీటి పొదుపుతో పాటు ఉపయోగించిన నీటిని రీసైక్లింగ్ ద్వారా ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నాయి. అదే బాటలు మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా నడుస్తున్నాయి. 600 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు రీసైక్లింగ్ నీటిని వినియోగిస్తున్నాయి.
హోటల్స్ కష్టాలు
చెన్నైలో నీటి కష్టాల కారణంగా పలు హోటల్స్ మూసివేశారు. కొన్ని హోటల్స్ భోజనం తయారీనీ నిలిపివేశాయి. ఉదాహరణకు వంద సీటర్స్ కలిగిన ఓ హోటల్కు రోజుకు 12వేల లీటర్ల నీరు అవసరమని, నీటి సమస్య కారణంగా ట్యాంకర్లు రావడంలేదని, వచ్చినా ఆలస్యమవుతోందని ఆ నీరు సరిపోవడం లేదని, దీంతో హోటల్స్కు వచ్చిన వారు చేయి కడుక్కోవాలంటే ఫింగర్ బౌల్స్ తప్పనిసరి చేసినట్లుగా చెబుతున్నారు. ఫింగర్ బౌల్స్ లేనిచోట వాష్ బేసిన్ వద్ద బకెట్లో నీళ్లు, మగ్గు పెట్టి సాధ్యమైనంత తక్కువ నీటిని వినియోగించేలా చర్యలు తీసుకున్నారు.