మీ నీళ్లు మీరే తెచ్చుకోండి, ఇంటి నుంచి పని చేయండి: చెన్నై ఐటీ ఉద్యోగులకు షాక్!
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో నీటికష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కంపెనీలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీలు... తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని కొన్ని కంపెనీలు, మీ డిస్బోసల్స్ మీరే తెచ్చుకోవాలని మరికొన్ని కంపెనీలు చెబుతున్నాయి. చెన్నైలోనే కాదు... తమిళనాడు వ్యాప్తంగా నీటి కటకట ఉంది. చెన్నైలో అయితే చాలా ఎక్కువగా ఉంది. 40 మిలియన్ లీటర్ల నీటిని జోలార్పేట రైల్వే స్టేషన్ నుంచి చెన్నైకి ట్యాంకర్ రైలు ద్వారా నీరు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మీ నీరు, మీ డిస్పోజల్స్ మీరే తెచ్చుకోండి
చెన్నైకి నీరు అందించే పూండి, పుళల్, చోళవరం, చెంబరంబాక్కం, రెడ్హిల్స్, వీరాణం వంటి జలాశయాలు దాదాపు అడుగంటిపోయాయి. వర్షాలు లేక, భూగర్భజలాలు పడిపోవడం, తెలుగుగంగ కింద చెన్నైకి రావాల్సిన కండలేరు నీరు సరఫరా కాకపోవడం వంటి కారణాలతో ఈ ఇబ్బందులు తలెత్తాయి. ఐటీ సెక్టార్ సహా పలు కార్యాలయాల్లో తాగునీరు లేక క్యాంట్లీన్లు మూసివేశారు. ఇంటి నుంచే భోజనం, తాగునీరు, డిస్పోజల్ గ్లాస్, ప్లేట్స్ తెచ్చుకోవాలని సూచిస్తున్నాయి. నీటి సమస్య ఎంతగా ఉందంటే... ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు తాము భోజన తయారీ నిలిపేస్తున్నట్లు ప్రముఖ హోటల్ గ్రూప్ వెల్లడించడం గమనార్హం. ప్రభుత్వం స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీటి ఎద్దడిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రానున్న 100 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్
నీటి సమస్య నేపథ్యంలో రానున్న వంద రోజుల పాటు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని (వర్క్ ఫ్రమ్ హోమ్) పలు కంపెనీలు సూచించాయి. చెన్నైలోని దాదాపు 12 ఐటీ కంపెనీలు... తమ కంపెనీలో పని చేసే 5,000 మంది ఉద్యోగులను టార్గెట్ రీచ్ అయ్యేలా మీ ఇష్టం ఉన్న చోట నుంచి పని చేయవచ్చునని సూచించింది. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులు ఇంటి నుంచే మంచినీళ్లు తెచ్చుకోవాలని సూచిస్తున్నాయి. రానున్న మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అంతకుముందు, నాలుగేళ్ల క్రితం ప్రయివేటు ట్యాంకర్స్ స్ట్రైక్ కారణంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనలు చేశాయి. ఇప్పటికే 55 శాతం ఐటీ కంపెనీలు రీసైకిల్డ్ వాటర్ సోర్సెస్ పైన ఆధారపడుతున్నాయి.
OMRలో నీటి కష్టాలు
OMR - ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో దాదాపు 600 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగులు దాదాపు 3,20,000 మంది ఉన్నారు. OMR ప్రాంతంలో రోజుకు దాదాపు 30 మిలియన్ లీటర్ల నీటి వినియోగం ఉంటుంది. ఇందులో 20 మిలియన్ లీటర్ల నీరు ఐటీ పార్క్, ఇతర ఐటీ కంపెనీలకు వెళ్తాయి. OMR ప్రాంతంలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు ఉంటారని, ఇందులో 5వేల మందికి మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఉందని, మిగతా కంపెనీలు కూడా క్రమంగా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇచ్చే పరిస్థితి ఉండవచ్చునని భావిస్తున్నారు.