భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే.. స్టార్స్పోర్ట్స్కు భారీ దెబ్బ, సెకనుకు రూ.2.5 లక్షల నష్టం!!
న్యూఢిల్లీ: ప్రపంచ కప్... ఫీవర్ ఎలా ఉంటుందో తెలిసిందే. అందులోను భారత్-పాకిస్తాన్, భారత్-ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్లు అంటే మరెంతో ఆసక్తి. భారత్-పాక్ మ్యాచ్ మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల ప్రజలతో పాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇందుకోసం పలు కంపెనీలు పెద్ద మొత్తంలో యాడ్స్ కోసం ఖర్చు చేస్తాయి. మ్యాచ్ ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్కు ఎనలేని లాభాలు వస్తాయి. కానీ వర్షం పడి రద్దయితే వీరంతా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.
ఏపీలో స్కూల్కు పంపిస్తే రూ.15,000! ఏ పథకం.. ఎంత లబ్ధి!!
ఇప్పటికే నాలుగు మ్యాచ్లు రద్దు
ప్రపంచ కప్లో భాగంగా ఈ రోజు (16, ఆదివారం) మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్లు రద్దయ్యాయి. ఈ మ్యాచ్ పైన కూడా నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు పడవద్దని దేశవ్యాప్తంగా పూజలు, ప్రపంచవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులే కాకుండా బడా కార్పోరేట్ సంస్థలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బ్రాండ్ ప్రమోషన్, ఉత్పత్తుల ప్రచారానికి కంపెనీలకు మంచి అవకాశం. కోట్లాది మంది చూడబోయే ఈ మ్యాచ్ కోసం కంపెనీలు కోట్లు ఖర్చు చేస్తాయి. ఇలాంటి మ్యాచ్ వర్షార్పణం కాకూడదని క్రికెట్ అభిమానులతో పాటు కంపెనీలు కోరుకుంటాయి. కోకాకోలా, ఉబర్, వన్ప్లస్, ఎంఆర్ఎఫ్ టైర్స్, ఫోన్ పే, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి బడా సంస్థలు తమ బ్రాండ్లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకుంటున్నాయి.
స్టార్ స్పోర్ట్స్కు పెద్ద దెబ్బ
వరల్డ్ కప్ మ్యాచ్ల ప్రసార సంస్థ స్టార్ స్పోర్ట్స్ భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ ప్రకటనల స్లాట్లను మిగతా మ్యాచ్లతో పోలిస్తే 50 శాతం అధిక రేటుకు విక్రయించిందని వార్తలు వస్తున్నాయి. కంపెనీలు కూడా పోటీపటీ స్లాట్స్ దక్కించుకున్నాయి. ఈ మ్యాచ్లో యాడ్స్ ప్రసారాల కోసం బ్రాడ్కాస్టర్కు లభించనున్న సమయం దాదాపు 5,500 సెకన్లు. అంటే 92 నిమిషాలు. సాధారణ మ్యాచ్లో స్లాట్స్ను రూ.1.6 నుంచి 1.8 లక్షల చొప్పున విక్రయించిన స్టార్ స్పోర్ట్స్ భారత్-పాక్ మ్యాచ్ కోసం రూ.2.5 లక్షల వరకు విక్రయించిందట. ఈ ఒక్క మ్యాచ్ యాడ్ స్లాట్స్ విక్రయం ద్వారానే స్టార్ స్పోర్ట్స్కు రూ.137 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని అంచనా. మ్యాచ్ రద్దయితే భారీ గండిపడే అవకాశముంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్ల వల్ల రూ.180 కోట్ల వరకు నష్టం జరిగితే పాక్-ఇండియా మ్యాచ్ వల్లే దాదాపు రూ.130 కోట్లకు పైగా దెబ్బపడనుందట.
స్టార్ ఇండియా
భారత్ - పాక్ మ్యాచ్ లాస్ట్ మినట్ యాడ్ స్పాట్లను స్టార్ ఇండియా 50 శాతం అధిక ప్రీమియంకు సిద్ధం చేసింది. ఈ కారణంగా 10 సెకండ్ల యాడ్ ఖర్చును రూ.25 లక్షలుగా ఫిక్స్ చేసిందట. అంటే ఒక్కో సెకండ్కు రూ.2.5 లక్షలు. ఇతర దేశాల మ్యాచ్లకు 10 సెకండ్లకు కాను యాడ్ ఖర్చు రూ.5 లక్షలు చార్జ్ చేస్తే, భారత్ - పాక్ మ్యాచ్ కోసం రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఫిక్స్ చేసింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే బ్రాడ్కాస్టర్కు పెద్ద ఎత్తున నష్టమని చెబుతున్నరు. అభిమానులు కూడా టిక్కెట్క్ కొనుగోలు చేశారని, వారికి తీవ్ర అసంతృప్తిని మిగుల్చుతుందని చెబుతున్నారు. సాధారణంగా ఐపీఎల్, ఐసీసీ వరల్డ్ కప్ వంటి మ్యాచ్లకు ఇన్సురెన్స్ ప్లాన్ కవర్ ఉంటుంది. ప్రీమియం రూ.40కోట్ల వరకు ఉంటుంది.
యూకే వెళ్లిన అభిమానులకు నిరాశ
వరల్డ్ కప్ మ్యాచ్లు చూసేందుకు భారత్ నుంచి పెద్ద ఎత్తున అభిమానులు యూకేకు వెళ్లారు. అసలు భారత్ - పాక్ మ్యాచ్ చూసేందుకే దాదాపు అందరు వెళ్లారు. ఇప్పుడు అదే మ్యాచ్ రద్దయితే వారికి తీవ్ర, తీరని అసంతృప్తి. దాదాపు 80,000 మంది భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఇప్పటికే ఇండియా-న్యూజిలాండ్, బంగ్లాదేశ్-శ్రీలంక, సౌతాఫ్రికా-వెస్టిండీస్, పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్లు రద్దయ్యాయి.
వర్షం పడితే పరిస్థితి ఏమిటి?
క్రికెట్ రూల్స్ బుక్ ప్రకారం మ్యాచ్ నిర్వహణకు ఏమాత్రం అవకాశం లేకుంటే మ్యాచ్ను రద్దు చేస్తారు. వన్డే మ్యాచ్ నిర్వహణ కోసం అధికారికంగా 8 గంటలు కేటాయిస్తారు. ఆ టైమ్ లోగా పరిస్థితులు అనుకూలిస్తే మ్యాచ్ నిర్వహించవచ్చు. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడితే మ్యాచ్ను రద్దు చేయాలా లేదా అనే నిర్ణయాన్ని అంపైర్లు సాయంత్రం 6.30 గంటల వరకు తీసుకోవచ్చు. (ఇంగ్లాండ్లో మ్యాచ్లు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 మధ్య జరుగుతున్నాయి.) పరిస్థితులు అనుకూలిస్తే గేమ్ టైమ్ ముగిసినా మరో 75 నిమిషాలు ఆటను పొడిగంచవచ్చు. కొన్ని సందర్భాలలో షెడ్యూల్ చేసిన సమయం కంటే రెండున్నర గంటల సేపు ఎక్కువగా రిఫరీ మ్యాచ్ ఆడించవచ్చు. ఇప్పటి దాకా ప్రపంచకప్లలో 9 మ్యాచ్లే వర్షం కారణంగా రద్దయ్యాయి. కానీ 2019లో ఇప్పటికే నాలుగు రద్దయ్యాయి. ఇదిలా ఉండగా, రిజర్వ్ డే లేకపోవడానికి కారణాలు ఉన్నాయి. టోర్నమెంట్ నిర్వహించే వ్యవధి, వ్యయం అన్నీ పెరుగుతాయి. అందుకే రిజర్వ్ డే లేదు.
గతంలో రూ.100 కోట్లకు పైగా ఆదాయం
2015 ప్రపంచ కప్లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు 28.8 కోట్లమంది చూశారు. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్లలో ఇది రెండో స్థానంలో ఉంది. అప్పుడు స్టార్ నెట్ వర్క్లో 93 బ్రాండ్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసుకున్నాయి. ఇండస్ట్రీ విశ్లేషకుల అంచనా ప్రకారం స్టార్ నెట్ వర్క్కు ఆ ఒక్క మ్యాచ్తోరూ.100 నుంచి రూ.110 కోట్ల మేర రాబడి వచ్చింది.