ఆధార్ కార్డు ఉన్న అందరికీ రూ.2 లక్షల రుణం! రెవెన్యూ పెరగాలంటే...
న్యూఢిల్లీ: స్క్రాప్ మెటల్ డీలర్ స్థాయి నుంచి బిలియనీర్ మెటల్స్ టైకూన్ స్థాయికి ఎదిగిన వేదాంత రిసోర్సెస్ ఫౌండర్ అనిల్ అగర్వాల్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. దేశంలోని వనరులను వెలికి తీయాలని సూచించారు. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్నారు. అలాగే, ఆధార్ కార్డుకు సంబంధించి మరో ముఖ్యమైన సూచన చేశారు. ఈ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.2 లక్షల చొప్పున రుణం ఇవ్వాలని సూచించారు. ఇలా చేస్తే ప్రభుత్వ రంగ సంస్థలు మూడు రెట్లు గొప్పగా పని చేయగలవన్నారు. ఆధార్ కార్డు హోల్డర్స్కు రూ.2 లక్షలు రుణం ఇవ్వడం ద్వారా పేదరికాన్ని నిర్మూలనకు, ఉద్యోగాల సృష్టికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆయన ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఇదీ భారత్ పరిస్థితి
భారత్ పరిస్థితిని ఆయన మదర్ ఇండియా సినిమాతో పోల్చారు. ఆ సినిమాలో రైతు 100 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే 80 క్వింటాళ్లను రుణం ఇచ్చిన వారు పట్టుకు వెళ్తారని, అలాగే భారత్ కూడా 50 శాతం ఆదాయాలను దిగుమతుల కోసమే ఖర్చు చేస్తోందని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ తర్వాత వడ్డీలకు చెల్లింపులు పోగా మిగిలేది ఏమీ లేదని చెప్పారు. సహజవనరులు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. మినరల్స్, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను మరింత పెద్ద ఎత్తున వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
జిల్లా కలెక్టర్లను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్లుగా...
స్మారక చిహ్నాలు, కోటలు, బీచ్ల వంటి వాటిని రెవెన్యూ తీసుకురావడంతో పాటు ఉద్యోగాలు కల్పించే ఉపాది కేంద్రాలుగా మార్చాలని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్లుగా మార్చాలని, తద్వారా స్మారక చిహ్నాలు, కోటలు, బీచ్లను టూరిజం ఇండస్ట్రీని అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించాలన్నారు.
సహజవనరులపై దృష్టి
సహజవనరులు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల ఉపాధికి అవకాశాలు ఉన్న కేంద్రాలు అని అనిల్ అగర్వాల్ చెప్పారు. భూమిపై చేసే వ్యవసాయం తదితరాలపై మనం బాగానే దృష్టి సారించామని, కానీ భూమి లోపల ఉండే సహజవాయువులపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఖనిజాలు, ఆయిల్, గ్యాస్ రిసోర్సెస్ వైపు చూడాల్సిన అవసరం ఉందన్నారు. దిగుమతుల బిల్లులు తగ్గించుకునేందుకు, ఉద్యోగాల కల్పన కోసం మోడీ ప్రభుత్వం ఐరన్ ఓర్, ఇతర మెటల్స్ అలాగే, బంగారం, ఆయిల్, గ్యాస్ వంటి విస్తారమైన నిల్వలను ఉఫయోగించుకోవాలన్నారు.
ఇండిపెండెంట్గా పని చేసే అవకాశమివ్వాలి
పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, బ్యాంకులు ఇండిపెండెంట్గా పని చేసే వెసులుబాటు కల్పించాలని, బ్రిటిష్ ఎయిర్వేస్, GE ల వలె సొంత బోర్డుతో రన్ చేసేలా ఉండాలని అనిల్ అగర్వాల్ అన్నారు. PSU, PSBలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తే ఇప్పుడు పని చేసిన దానికంటే మూడింతలు బాగా పని చేస్తాయన్నారు. ఎంటర్ప్రెన్యూయర్స్పై ప్రభుత్వం విశ్వాసం ఉంచాలని, వారికి మద్దతుగా నిలవాలన్నారు. అప్పుడే ఎకానమీక, ఉద్యోగాల సృష్టికి కొత్త ఉత్సాహం వస్తుందన్నారు.
రూ.2 లక్షల వరకు మైక్రో లోన్లు
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో సత్యయుగం వచ్చినట్లుగా భావిస్తున్నట్లు అనిల్ అగర్వాల్ చెప్పారు. ఈ ప్రభుత్వంలో కోటరీలు వంటివి లేవని, కేవలం పనితీరు ఆధారంగానే ముందుకు సాగుతోందని అభిప్రాయపడ్డారు. ఎంటర్ప్రెన్యూయర్షిప్ను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఆధార్ కార్డు హోల్డర్స్కు రూ.2 లక్షల వరకు మైక్రో లోన్స్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం 30 శాతం మందికి ప్రాంతీయ కళలు (రీజినల్ ఆర్ట్స్), స్పోర్ట్స్ కోసం కేటాయించాలన్నారు. స్మారక కేంద్రాలు, కోటలు, బీచ్లను టూరిస్ట్ కేంద్రాలుగా మార్చి, ఉద్యోగ సృష్టి, రెవెన్యూ కేంద్రాలుగా తయారు చేయాలని చెప్పారు. 700 జిల్లాలు ఉన్నాయని, ఒక్కో జిల్లాకు ఒక్కో కలెక్టర్ ఉన్నారని, వారిని బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్లుగా నియమించి.. ఆయా జిల్లాల్లో టూరిజం, ఇండస్ట్రీ, మైనింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ను అభివృద్ధి చేసే విధంగా మలుచుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విధానస్థాయి నిర్ణయాలు ఉండాలని, ఫైల్స్ ఏవీ కూడా పెండింగ్లో ఉండవద్దని, వెంటనే అప్రూవ్ చేసేలా ఉండాలన్నారు. అలాగే, 1.8 లక్షల మంది అంగన్వాడీలపై కూడా ఆయన సూచనలు చేశారు.