విమానం ఎక్కాలంటే..చేతి చమురు వదిలించుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణం ఇకపై మరింత భారం కానుంది. ప్రయాణికులపై అదనపు భారాన్ని మోపబోతోంది పౌర విమానయాన మంత్రిత్వశాఖ. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. విమాన భద్రతా ఫీజు మొత్తాన్ని సవరించింది. ప్రస్తుతం ఉన్న 130 రూపాయల ఫీజు మొత్తాన్ని 150 రూపాయలకు పెంచింది. దీనివల్ల విమాన ప్రయాణ ఛార్జీల్లో తప్పనిసరి పెరుగుదల చోటు చేసుకుంటుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి.
ప్రస్తుతం ప్రయాణికుల నుంచి సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తున్నారు. దీని స్థానంలో కొత్తగా ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజును అమల్లోకి తీసుకుని రానుంది కేంద్రం. ఏవియేషన్ సెక్యూరిటీ ఛార్జీని ప్రతి ప్రయాణికుడు ఇకపై చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై పౌర విమానయాతన మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ప్రయాణికుల నుంచి ఇప్పటిదాకా వసూలు చేసిన సర్వీసు ఛార్జీలతో పోల్చుకుంటే ఈ సెక్యూరిటీ ఫీజు అధికం సేవల రుసుము కంటే విమానయాన భద్రతా రుసుము ఎక్కువగా ఉంటోంది.
తాజా నిబంధనల ప్రకారం.. దేశీయ ప్రయాణికులకు ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు రుసుము 150 రూపాయలుగా, అంతర్జాతీయ ప్రయాణికులకు 4.85 డాలర్లుగా నిర్ధారించారు. ఇదివరకు దేశీయ విమాన ప్రయాణికుల నుంచి 130 రూపాయలు, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల నుంచి 3.25 డాలర్లను వసూలు చేస్తుండే వారు. దీన్ని సవరించారు. దీని ప్రభావంతో ప్రయాణికులకు టికెట్ ఖర్చులు పెరగనున్నాయి.