మీ బైక్ లేదా కారుకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? ఒకవేళ తీసుకోక పోతే వెంటనే తీసుకోండి. ఎందుకంటే మరో పది రోజుల్లో ఈ బీమా ప్రీమియం పెరగ బోతోంది. అప్పుడు మీరు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది మరి.
కార్లు, టూవీలర్లకు సంబంధించిన తప్పనిసరిగా తీసుకోవాల్సిన థర్డ్ పార్టీ (టీపీ) బీమా మరింతగా పెరగనుందన్న వార్తలు అటు వాహనాల తయారీ కంపెనీలు ఇటు వాహన వినియోగదారుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐ ఆర్ డీ ఏ ఐ ) ఆదేశాల ప్రకారం కొత్త బీమా ప్రీమియం ఈ నెల 16వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇది అమల్లోకి వస్తే టీపీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం 21 శాతం పెరగనుంది. 1,000 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన చిన్న కార్లకు జూన్ 16 నుంచి రూ. 2,072 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది రూ.1,850 మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది ఏకంగా 12 శాతం పెరిగింది. 1,000-1,500 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్లకు బీమా ప్రీమియం రూ.3,221కి పెరిగింది. 1,500 సీసీ దాటినా కార్లకు థర్డ్ పార్టీ బీమా ప్రీమియం ఇంతకు ముందున్న మాదిరిగా రూ.7,890 ఉంటుంది.

ఇక బైక్స్ విషయానికొస్తే .. 75 సీసీకన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న టూవీలర్లకు థర్డ్ పార్టీ ప్రీమియం రూ. 482కు చేరింది. 75-150 సీసీ ప్రీమియం బైకులకు రూ.752గా 150-350 సీసీ బైకులకు ప్రీమియం 21.11 శాతం వృద్ధితో రూ.1,193జి పెరిగింది.
థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెరిగితే...
ఇప్పటికే ఆటోమొబైల్ కంపనీల అమ్మకాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఫైనాన్స్ రేట్లు, ఇంధన ధరలు, బీమా ప్రీమియం వంటివి వాహనాల అమ్మకాలను ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని కంపనీలు తమ కార్ల ఉత్పత్తిని తగ్గించు కుంటున్నాయి. అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశలు ఇప్పుడున్న పరిస్థితుల్లో లేవు. అయితే ఇదే సమయంలో థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంచడం వల్ల మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంపు తో వాహన అమ్మకాలు మరింత తగ్గుతాయని ఫెడరేషన్ అఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) సెక్రటరీ మనీష్ రాజ్ సింఘానియా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం పెంపు ప్రభావం బీమా కంపనీలపై కూడా ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications