50కు పైగా సీపీఎస్ఈ ఆస్తులను విక్రయించనున్న నీతి అయోగ్
న్యూఢిల్లీ: సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (CPSE) ఆస్తులను విక్రయించేందుకు నీతి అయోగ్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 50కి పైగా CPSE ఆస్తుల జాబితాను సిద్ధం చేసిందని తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వరంగ NTPC, సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెండ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ మేరకు నీతి ఆయోగ్ ఈ జాబితాను ఇప్పటికే డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ (DIPAM)కు పంపించిందని అధికారులు చెప్పారని తెలుస్తోంది. నిధుల సమీకరణ కోసం ఈ ఆస్తులను విక్రయించనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. విక్రయ ప్రక్రియను ప్రారంభించేందుకు ఈ జాబితా ఉపయోగపడుతుందని చెప్పారు.
సమయం వచ్చినప్పుడు విక్రయాలు ప్రారంభిస్తామని మరో అధికారి వెల్లడించారు. ముసివేయబడిన NTPC బదార్పూర్ ప్లాంట్కు సంబంధించి 400 ఎకరాల స్థలం ఉంది. సెయిల్ సహా పలు కంపెనీల ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు.
మరో గుడ్న్యూస్.. ఆన్లైన్ నగదు బదలీపై వసూళ్లుండవ్: NEFT, RTGS ఛార్జీలు ఎత్తివేత
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పెట్టుబడుల ఉపసంహరణ (disinvestment) భాగంగా రూ.90,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రూ.2,350 కోట్లను రానున్న రెండు నెలల్లో సమీకరించనుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 టార్గెట్కు గాను రూ.84,972.16 కోట్లు సమీకరించింది.
అంతకుముందు, DIPAM... స్కూటర్ ఇండియా, భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్, ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా, హిందుస్తాన్ ప్రిఫ్యాబ్, హిందుస్తాన్ న్యూస్ప్రింట్, బ్రిడ్జ్ అండ్ రూఫ్ కో., హిందుస్తాన్ ఫ్లూరోకార్బన్స్ కంపెనీలకు చెందిన ఆస్తులను గుర్తించింది. ఇవి స్ట్రాటెజిక్ సేల్కు సిద్ధంగా ఉన్నాయి.