వంటనూనె కంపెనీ నుంచి గ్లోబల్ ఐటీ దాకా.. ప్రేమ్జీ ప్రస్థానం! సేవా కార్యక్రమాల కోసం రూ.వేలకోట్లు
విప్రో చైర్మన్, కంపెనీ వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్జీ జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. కంపెనీకి 53 ఏళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న ఆయన తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో కొడుకు రిషద్ బాధ్యతలు చేపడతారు. పదవీ విరమణ చేయనున్న అజీమ్ 2024 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతారు. రిషద్ ప్రస్తుతం కంపెనీ చీఫ్ స్ట్రాటజీ అధికారిగా, బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన నూతన చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారు. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అబిదాలి జెడ్ నీముచ్వాలాకు పదోన్నతి కల్పించింది. జూలై 31 నుంచి ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్గాను, మేనేజింగ్ డైరెక్టర్గాను బాధ్యతలు చేపడతారు.
పదవీవిరమణ చేయనున్న విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ...విప్రో వారసుడు ఎవరో తెలుసా..?
వంటనూనెల నుంచి గ్లోబల్ ఐటీ కంపెనీగా
భవిష్యత్తులో దాతృత్వ కార్యకలాపాల కోసం మరింత సమయం వెచ్చించేందుకు అజీమ్ ప్రేమ్జీ ఆసక్తి చూపిస్తున్నారు. ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నట్లు ఆయన గత మార్చిలో ప్రకటించారు. చిన్నగా ప్రారంభమైన విప్రో... అంచెలంచెలుగా ఎదిగి 8.5 బిలియన్ డాలర్ల (59 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంది. అజీమ్ ప్రేమ్జీ సారథ్యంలో ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ అండ్ మెడికల్ డివైజ్ విభాగాల్లోకి అడుగు పెట్టింది. వంట నూనెలు తయారు చేసే చిన్న స్థాయి కంపెనీ నుంచి గ్లోబల్ ఐటీ కంపెనీగా ఎదిగింది. ఈ ఘనత అజీమ్దే. 1945లో తన తండ్రి స్థాపించిన వంట నూనెల కంపెనీని గ్లోబల్ ఐటీ ఫర్మ్ స్థాయికి తీసుకెళ్లారు ప్రేమ్జీ. 1966లో తన తండ్రి మరణానంతరం కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. 1982లో విప్రో ఐటీ ప్రోడక్ట్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. 2000 సంవత్సరంలో విప్రో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. బీపీవో వ్యాపారంలోకి అడుగు పెట్టింది. విప్రోలో అజీమ్ షేర్లు 74.3 శాతంగా ఉన్నాయి.
ఇక ధార్మిక కార్యక్రమాల కోసం సమయం
అజీమ్ ప్రేమ్జీని పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. భారతీయ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్నారు. అజీమ్ ప్రేమ్జీ యాజమాన్యంలోని కంపెనీల్లో 34 శాతం షేర్లను తన పేరుతో స్థాపించిన ఫౌండేషన్కు కేటాయించారు. దీనికి తోడు ధార్మిక కార్యకలాపాల కోసం అదనంగా రూ.52,750 కోట్ల విలువ గల షేర్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. దీంతో ఆయన ధార్మిక కార్యకలాపాల కోసం చేసిన కేటాయింపు రూ.1.4 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రేమ్జీ విద్యారంగంలో సేవలు అందించడంతో పాటు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్న దాదాపు 150కి పైగా స్వచ్చంధ సంస్థలకు ఆర్థికంగా తోడ్పాడు అందిస్తున్నారు. జూలై 30వ తేదీ నాటికి ఆయనకు 74 సంవత్సరాలు నిండుతాయి. 53 ఏళ్ల పాటు కంపెనీని నడిపారు. ఐటీ ఇండస్ట్రీలో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ దిగ్గజాలు.
ఎవరీ రిషద్?
అజీమ్ ప్రేమ్జీ తన తనయుడు రిషద్కు కంపెనీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. రిషద్ వయస్సు 42 ఏళ్లు. హార్వార్డ్ బిజినెస్ స్కూల్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. విప్రోలో ఆయన 2007లో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ విభాగంలో చేరారు. కంపెనీ ఎదుగుదలకు రిషద్ కృషి చేశారు. ప్రస్తుతం ఆయన చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్గా ఉన్నారు. నూతన చైర్మన్గా నియమితులవడం సంతోషంగా ఉందని, వాటాదారులకు, ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించడానికి తనవంతుగా కృషి చేస్తానని రిషద్ ప్రకటించారు.
అజీమ్ ప్రేమ్జీ ఏమన్నారంటే?
విప్రో కంపెనీని అంతర్జాతీయస్థాయికి తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని అజీమ్ ప్రేమ్జీ అన్నారు. క్లయింట్లకు, భాగస్వామ్యులకు, ఇతర వాటాదారులు తమపై పెట్టుకున్న విశ్వాసం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కంపెనీ ఈ స్థాయికి ఎదగడం వెనుక వేలాది మంది ఉద్యోగుల పాత్ర ఉందని ఆయన కితాబిచ్చారు. విప్రో తనకు అత్యంత సంతృప్తికరమైన ప్రయాణమని, రిషద్ నాయకత్వంపై తనకు విశ్వాసం ఉందని, ఆయన సారథ్యంలో విప్రో వృద్ధి పథంలో కొత్త శకంలోకి అడుగు పెడుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.