జీఎస్టీని కుదించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి: ప్రభుత్వానికి పలు కంపెనీల విజ్ఞప్తి
మోడీ ప్రధానిగా రెండవ సారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు జీఎస్టీ తగ్గించాలంటూ గట్టి లాబీయింగ్ చేస్తున్నాయి.కొన్ని పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే ఎయిర్ కండీషనర్లు, టీవీ సెట్లపై జీఎస్టీ 28 శాతం ఉందని..ఇది చాలా రోజుల నుంచి కొనసాగుతోందని గుర్తుచేశారు. గతేడాది జీఎస్టీ 28 శాతం ఉన్న చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు 18 శాతానికి తగ్గించబడ్డాయని చెబుతున్నారు. ఇక ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తగ్గించాలని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్నంది చెప్పారు. అధిక జీఎస్టీ బ్రాకెట్లో వాటిని చేర్చడం అర్థం లేని విషయం అని అన్నారు.
జీఎస్టీ తగ్గిస్తే వస్తువు ధర తగ్గుతుందని తద్వారా ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతందని అన్నారు. జీఎస్టీ పై 10శాతం తగ్గిస్తే ఉత్పత్తి నికర ధర 7 నుంచి 8శాతం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.ఇది వినియోగదారులకు కూడా ఊరటనిస్తుందని చెప్పిన ఆయన..కొత్త ఎనర్జీ లేబలింగ్లో వచ్చిన నిబంధనలు ఒక్క యూనిట్ ఉత్పత్తిపై రూ. 5000వరు పెరిగాయని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే ది సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చురర్స్ కూడా ఇదే విషయమై ప్రభుత్వాన్ని కోరారు. వాణిజ్య లేదా ప్రయాణికులు ప్రయాణించే వాహనాలపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది.
కమర్షియల్ వాహనాలు, ప్రయాణికులు ప్రయాణించే వాహనాలు అంటే కార్లు, ద్విచక్రవాహనాలపై 28శాతం జీఎస్టీ ఉందని దీనికి అదనంగా ఇంజిన్ సైజు, వాహన పొడవు, ఇంధనం టైపు, వాటిని బట్టి 1-నుంచి 15శాతం పన్ను పడే అవకాశం ఉందని రాజన్ వధేరా తెలిపారు. 2019 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్స్కు డిమాండ్ పెరిగింది.దీంతో అమ్మకాల్లో 3.2 శాతం పెరిగింది. అయితే గత నాలుగేళ్లలో ఇది చాలా తక్కువని ఆయన చెప్పారు. ఇక ఆటోమొబైల్ అమ్మకాలు గత ఏప్రిల్ నెలలో అత్యంత దారుణంగా తగ్గాయని గుర్తు చేశారు.
ప్రభుత్వం జీఎస్టీని సమాంతరంగా ఉంచితే బాగుంటుందనే అభిప్రాయం రియల్ ఎస్టేట్ వారు చెబుతున్నారు. అంతకుముందు రూ.45 లక్షలు అయ్యే గృహ నిర్మాణాలపై 8 శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు 1శాతానికి తగ్గించడం జరిగింది.ఇక మిగతా గృహ నిర్మాణాలు 5శాతం నుంచి 12 శాతం వరకు జీఎస్టీ పడుతోంది. ఇక రూ.75 లక్షల వరకు ఉన్న గృహాలపై జీఎస్టీని 1శాతానికి తీసుకురావాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.