మోడీ 2 ప్రమాణ స్వీకారాల మధ్య... రూ.69.22 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ప్రధాని నరేంద్ర మోడీ 2014లో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గురువారం (మే 30) మధ్య రెండోసారి బాధ్యతలు చేపట్టే వరకు ఇన్వెస్టర్లు ఎన్ని డబ్బులు గడించారో తెలుసా... దాదాపు రూ.70 లక్షల కోట్ల ఆదాయం పొందారు. మోడీ ప్రమాణం చేసిన మరుసటి రోజు అంటే నేడు (శుక్రవారం మే 31) సెన్సెక్స్, నిఫ్టీ 40,000, 12,000 మార్క్ దాటి రికార్డ్ సృష్టించింది. ఓ దశలో సెన్సెక్స్ 40,122 చేరుకొని, 37.714 వద్ద క్లోజ్ అయింది.
మోడీ 2014 మే 26న తొలిసారి ప్రధానీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు సెన్సెక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.85,20,816.63 కోట్లుగా ఉంది. నిన్న మోడీ ప్రమాణ స్వీకారం రోజున అది రూ.1,54,43,363.95 కోట్లుగా ఉంది. అంటే అప్పటికి ఇప్పటికీ ఇన్వెస్టర్లు భారీగా సంపాదించారు. ఈ లెక్కన మోడీ మొదటిసారి, రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మధ్యకాలంలో ఇన్వెస్టర్లు 69.22 లక్షల కోట్లు సంపాదించారు. అంతేకాదు, బ్యాంకింగ్, ఆటో, రియాల్టీ, ఫార్మా, ఐటీ, మెటల్, కేపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరబుల్స్ విలువ కూడా భారీగా పెరిగింది.
కాగా, మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో కొనసాగాయి. లోహ, ఫార్మా, బ్యాంకింగ్, ఆటో మొబైల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్ల కొనుగోళ్ల కళతో జూన్ డెరివేటివ్ సిరీస్ను సూచీలు రికార్డు స్థాయిలో ఉత్సాహంగా ప్రారంభించాయి. అయితే కేబినెట్ కూర్పు తర్వాత కొంత నష్టాల్లోకి జారుకున్నాయి. ఊగిసలాట మధ్య కాస్త కోలుకున్నా నష్టాలు తప్పలేదు.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావం, ఫారన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగడంతో పాటు సేల్స్ పెరగడంతో మార్కెట్ ఉదయం 40వేల మార్కు దాటింది. నిఫ్టీ 12వేల మార్క్ దాటింది. మధ్యాహ్న సమయంలో కేబినెట్ కూర్పు తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యాయి. నిర్మలా సీతారామన్ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై ఇన్వెస్టర్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
ఎవరూ ఊహించని మోడీ నిర్ణయం: నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ