అమెరికా యూరోప్ మార్కెట్ ఫార్ములేషన్తో లాభాల బాటలో అరబిందో ఫార్మా
హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా లాభాల బాటలో పయనిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.5,292.2 కోట్ల ఆదాయాన్ని, రూ.585.4 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.4,049.1 కోట్లు, నికరలాభం రూ.528.5 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆదాయం 30.7 శాతం, నికరలాభం 10.8 శాతం పెరిగినట్లు అవుతోంది.
గత ఆర్థిక సంవత్సరానికి అమెరికాలో ఫార్ములేషన్ల విక్రయాలు 21.3 శాతం మేరకు పెరిగి రూ.9,030 కోట్లకు చేరాయి. యూరోప్ మార్కెట్ అమ్మకాల్లో కూడా 13.9 శాతం వృద్ధి నమోదైంది. ఈ మార్కెట్లో రూ.4,960.2 కోట్ల విక్రయాలు జరిగాయి. వర్థమాన మార్కెట్ల ఆదాయం 33.1 శాతం పెరిగి రూ.1,193.7 కోట్లకు చేరిందని అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీఐ వ్యాపారం విక్రయాల ఆదాయం 14.9 శాతం పెరిగి రూ.3,403 కోట్లకు చేరాయి. 2019, మార్చితో ముగిసిన మూడు నెలల్లో 22 ఏఎన్డీఏలను కంపెనీ దాఖలు చేసింది.
ఇదిలా ఉంటే మాతృ సంస్థ అయిన అరబిందో ఫార్మాలో కొన్ని అనుబంధ కంపెనీలను విలీనం చేసేందుకు డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఇందులో ఆరు కంపెనీలను గుర్తించి అరబిందో ఫార్మాలో విలీనం చేసేందుకు నిర్ణయించారు. వీటిలో ఏపీఎల్ హెల్త్కేర్ లిమిటెడ్, ఏపీఎల్ రీసెర్చ్ సెంటర్ లిమిటెడ్, ఆరోజైమ్స్ లిమిటెడ్, కూర్ప్రో పేరెంటరల్స్, హయసింత్స్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇక ఈ ఆరు కంపెనీల్లో ఏపీఎల్ హెల్త్ కేర్, సిలికాన్ లైఫ్ సైన్సెస్ కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేస్తుండగా మిగతావన్నీ అంతంత మాత్రంగానే ఉన్నాయి.ఈ కంపెనీలు విలీనం చేస్తే వాటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు సులభతరం అవ్వడమే కాకుండా వీటిమీద అధిక ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు.