నరేష్ గోయల్ దంపతుల్ని విమానం నుంచి దించేశారు: లండన్ పారిపోయేవారా?
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయెల్కు ముంబై విమానాశ్రయంలో చుక్కెదురైంది. వారు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. శనివారం వీరిద్దరు లండన్కు బయలుదేరారు. విమానం టేకాఫ్కు కొద్ది నిమిషాల ముందు ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని నిలిపేశారు. ఎమిరేట్స్కు చెందిన ఈకే 507 విమానంలో వారు అప్పటికే కూర్చున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ విమానాన్ని పార్కింగ్ స్థలానికి తీసుకువెళ్లి ఈ గోయల్ దంపతులను కిందకు దించారు. దీంతో విమానం దాదాపు గంటన్నర ఆలస్యంగా బయలుదేరింది.
వెంట 4 భారీ సూట్కేసులు
గోయల్ దంపతులు తమ వెంట నాలుగు భారీ సూట్కేసులతో లండన్ బయలుదేరారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బ్యాగేజీ అంతా అనితా గోయల్ పేరిట ఉందని అధికారులు గుర్తించారు. వాటిని కూడా వెనక్కి తెప్పించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ పెట్టుబడులపై ఎతిహాద్, హిందూజా గ్రూప్లతో చర్చలు జరిపేందుకు వారు లండన్ బయలుదేరినట్లుగా మరికొందరు చెబుతున్నారు. దీనిపై గోయల్ దంపతులు స్పందించాల్సి ఉంది.
దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకున్నారా?
నరేష్ గోయెల్, అనితలు లండన్కు వెళ్లాల్సి ఉందని, అయితే దేశం వదలి వెళ్లకుండా వారిని అడ్డుకున్నామని అధికారులు తెలిపారు. వీరిపై లుకౌట్ నోటీసులు ఉన్నందునే ఆపివేయాల్సి వచ్చిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల జెట్ అధికారులు, సిబ్బంది సంఘం అధ్యక్షుడు కిరణ్ పవాస్కర్... గోయల్ దంపతుల పాస్పోర్ట్స్ను సీజ్ చేయాలని ముంబై పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. జెట్ డైరెక్టర్లు, కీలక పదవుల్లోని పాస్పోర్ట్స్ను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గోయల్ దంపతులను అడ్డుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గోయల్ దంపతుల స్పందన ఏమిటి?
ఈ అంశంపై నరేష్ గోయల్ స్పందించాల్సి ఉంది. ఎమిరేట్స్ మాత్రం అధికారులకు సహకరించినట్లు శనివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. వీరిని విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం వెనక కారణమేమిటో స్పష్టమైన కారణం తెలియాల్సి ఉంది. జెట్ సంక్షోభం నేపథ్యంలో ఎతిహాద్, హిందుజా గ్రూప్లకు చెందిన ఎగ్జిక్యూటివ్లతో సమావేశం కావడానికే గోయల్ దంపతులు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు, వారి పాస్పోర్ట్స్ సీజ్ చేయాలని కిరణ్ పావస్కర్ లేఖ రాసిన నేపథ్యంలో గోయల్ను అడ్డుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, జెట్ సంక్షోభంపై తీవ్ర నేరాల పరిశోధనా కార్యాలయం (ఎస్ఎఫ్ఐఓ), ఈడీ దర్యాప్తు ప్రారంభించిందని తెలుస్తోంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) జెట్, జెట్ ప్రివిలేజ్ పుస్తకాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కంపెనీ నుంచి నిధుల్ని మళ్లించారా అన్న కోణంలోనూ దర్యాఫ్తు సాగుతోంది.