చైనా స్మార్ట్ఫోన్ల దెబ్బ, భారత్కు సోనీ మొబైల్ గుడ్బై: ఆల్రెడీ యూజ్ చేస్తుంటే మాత్రం...
భారత్లో స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య గట్టి పోటీ ఉంది. ప్రపంచంలోని ఫోన్ల కంపెనీలు కలిగి ఉన్న అతి పెద్ద మార్కెట్లో సోనీ ఒకటి. ఇలాంటి దిగ్గజ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. సోనీ అంటే బ్రాండ్. ఇది తమ ప్రతి వస్తువును ఇండియాలోను విడుదల చేస్తుంది. కానీ ఇప్పుడు సోనీ తీసుకున్న అనూహ్య నిర్ణయం కారణంగా ఇక నుంచి భారత్లో సోనీ స్మార్ట్ ఫోన్లు ఉండవు.
అత్యవసరమా?: 2 రోజుల్లో పాన్కార్డ్ పొందడం ఎలా?
భారత్లో సోనీ స్మార్ట్ ఫోన్ నో
ఇక నుంచి సోనీ విడుదల చేసే స్మార్ట్ ఫోన్లు భారత్లో విడుదల కాబోవు. ఈ కంపెనీ ఇటీవల నష్టాలను చవి చూస్తోంది. దీంతో భారత్ మార్కెట్ నుంచి స్మార్ట్ ఫోన్ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దక్షిణ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలపై ఇక నుంచి పెద్దగా దృష్టి సారించబోమని స్పష్టం చేసింది. జపనీస్ ఎలక్ట్రానిక్ ఫర్మ్ సోనీ.. మార్చి ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 97.1 బిలియన్ యెన్ (879.45 డాలర్లు) నష్టపోయింది. అదే సమయంలో ఆపిల్, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ లాభాల్లో ఉన్నాయి.
అందుకే భారత్కు సోనీ దూరం
2020ను కంపెనీకి లాభాల ఆర్థిక సంవత్సరంగా మార్చుకోవాలని సోనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నిర్వహణ వ్యయాలను 50 శాతం వరకు తగ్గించాలని చూస్తోంది. లాభసాటి మార్గం, 5G సేవలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి మేము జపాన్, యూరప్, హాంగ్కాంగ్, తైవాన్ దేశాల్లో మార్కెట్ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తామని, ఇప్పటికే సెంట్రల్, సౌత్ అమెరికాలో అమ్మకాలు నిలిపేశామని,. అదే విధంగా దక్షిణాసియా దేశాల్లో పరిస్థితులను బట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని సోనీ తెలిపింది.
సోనీ వినియోగిస్తున్న వారికి ఊరట
ఇప్పటికే తమ స్మార్ట్ ఫోన్ను వినియోగిస్తున్న వారికి మాత్రం కంపెనీ తరఫున సేవలు అందిస్తామని సోనీ తెలిపింది. విక్రయాలు ఆపేసినా తమ ఫోన్లు వాడే యూజర్లకు సేవలు ఉంటాయని పేర్కొంది. సాఫ్టువేర్ అప్డేషన్స్తో సహా అన్ని రకాలుగా వినియోగదారులకు అండగా ఉంటామని తెలిపింది. చైనా, భారత్ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్. ప్రముఖ కంపెనీలు ఇఖ్కడ ఫోన్లు విక్రయిస్తాయి. ఇటీవల స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో చైనా కంపెనీల జోరు కొనసాగుతోంది. తక్కువ ధరకు, ఎక్కువ ఫీచర్లు రావడం యూజర్లను ఆకట్టుకుంటుంది. దీంతో సోనీ వంటి బ్రాండెడ్ కంపెనీలపై ప్రభావం పడుతోంది. స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చాలామంది యూజర్లు రెండు మూడేళ్ల కంటే ఎక్కువగా ఉపయోగించడం లేదు. మరోవైపు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, కొత్త ఫీచర్లతో ఫోన్లు వస్తున్నాయి. దీంతో చైనా మొబైల్స్పై యూజర్లు దృష్టి పెడుతున్నారు. ఈ దెబ్బ సోనీపై కూడా పడింది.