ఉద్యోగులకు గుడ్ న్యూస్: జెట్ కొనుగోలు యోచనలో హిందూజా గ్రూప్, షేర్ల దూకుడు
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ తాత్కాలికంగా మూతబడిన జెట్ ఎయిర్వేస్లో వాటాలు కొనుగోలు చేసేందుకు హిందూజా గ్రూప్ ఆసక్తిగా ఉంది. జెట్ కొనుగోలు బిడ్డింగ్ అంశాన్ని పరిశీలిస్తున్నామని హిందూజా వర్గాలు తెలిపాయి. జెట్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్, జెట్లో పెట్టుబడులు ఉన్న ఎతిహాద్, ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. దీనిపై ఎస్బీఐ కన్సార్టియం లేదా ఎతిహాద్ స్పందించలేదు.
జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు హిందూజా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయనే ప్రచారం నేపథ్యంలో ఈ షేర్లు లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ ధర రూ.12.94 శాతం పెరిగి 148.40 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో 14.73 శాతం పెరిగి 150.75 వద్ద క్లోజ్ అయింది.
నరేశ్ గోయల్, హిందూజాల మధ్య గత రెండు దశాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే జెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు హిందూజాలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాను తీసుకునేందుకు హిందూజా గ్రూప్ ప్రయత్నాలు చేసింది. అయితే సంస్థ భారీగా అప్పులలో కూరుకుపోవడంతో ఆ ప్రయత్నాలు ఆపేసింది.
1997-2000 మధ్య షార్జా-భారత్ మధ్య కార్గో సర్వీసుల కోసం లుఫ్తాన్సా ఎయిర్ కార్గోతో హిందూజా గ్రూప్ జత కలిసింది. జెట్ను గాడిలో పెట్టేందుకు రుణదాతలు కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావటంతో గత నెల 17 నుంచి సంస్థ కార్యకలాపాలు నిలిచిన విషయం తెలిసిందే. జెట్ను చేజిక్కించుకునేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి కనబరిచినా రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం వాటికి ఆమోదం తెలపలేదు. దీంతో జెట్ పరిస్థితి ఆందోళనగా ఉంది. ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.