మొదటిసారి విదేశీ టూర్ వెళ్దామనుకుంటున్నారా.. ముందు ఇవి ప్లాన్ చేసుకోండి
విదేశీ టూర్.. ఈ రోజుల్లో మధ్యతరగతి ప్రజలు కూడా ఎంతో ఉత్సాహాంగా వెళ్లాలని చూస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకేజీలతో వివిధ టూరిజం సంస్థలు ఫారిన్ టూర్లను ఆఫర్ చేస్తున్నాయి. అందుకే విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరింత మంది ఇంకా ప్లానింగ్ దశలో ఉన్నారు. ఈ నేపధ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి మంచి టిప్స్ ఇస్తున్నాం. పాస్ పోర్ట్ దగ్గరి నుంచి వీసా, ఫారెక్స్ వంటి అనేక అంశాలను మీకు పరిచయం చేస్తున్నాం.
PMJJBYని ఎందుకు రెన్యూవల్ చేయించుకోవాలి?
పాస్పోర్ట్ - వీసా ఇలా ప్లాన్ చేసుకోండి
విదేశాలకు వెళ్లాలి అనుకునేవాళ్లకు ముఖ్యంగా కావాల్సింది పాస్పోర్ట్. అందుకే మీ ఫారిన్ టూర్ ప్లానింగ్కు కొన్ని నెలల ముందే పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకోండి. ఫ్రెష్ అప్లికేషన్కు రూ.1500, తత్కాల్ దరఖాస్తుకు రూ.2000 ఖర్చవుతుంది. ఇక వీసాల విషయానికి వస్తే.. ఒక్కో దేశం ఒక్కో రకంగా ఫీజులను వసూలు చేస్తుంది. థాయిల్యాండ్, కాంబోడియా, వియత్నం, మాల్దీవ్స్, టాంజానియా, శ్రీలంక, కెన్యా, జోర్డాన్ వంటి దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంటే ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత మీరు వీసా పొందొచ్చు. దేశాన్ని బట్టి రూ.1400 నుంచి రూ.9500 వరకూ వీసా ఛార్జీలు ఉంటాయి. అయితే భూటాన్, నేపాల్, ఇండోనేషియా, సెర్బియా దేశాల్లో వీసా లేకుండా కూడా ప్రయాణించే వీలుంది.
అయితే కొన్ని దేశాల వీసా ఛార్జీలు చిత్రంగా ఉంటాయి. బాలీ వంటి దేశాలు ఎంట్రీకి కొంత, ఎగ్జిట్కు కొంత ఛార్జీలను వసూలు చేస్తాయి. బాలీలో డిపార్చర్ ట్యాక్స్ 15 డాలర్లు ఉంటుంది.
ప్రయాణ బీమా
విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లు ఖచ్చితంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ను తీసుకోవాలి. ఇంకొన్ని దేశాల్లో ప్రయాణబీమా ఉండడం తప్పనిసరి కూడా. సాధారణంగా ఈ బీమా ఛార్జీలు మన ట్రిప్ ఖర్చులో 1 నుంచి 4 శాతం వరకూ ఉంటాయి. రూ.15 నుంచి 25 వేల వరకూ బీమా ఛార్జీలు ఉంటాయి. ఈ సౌకర్యం పొందితే.. మనకు విదేశాల్లో ఏదైనా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తినా, పాస్పోర్ట్ పోయినా, లగేజ్ మాయమైనా, ఫ్లైట్స్ మిస్ అయినా.. లేక మరేదో కారణంతో ప్రయాణం రద్దైనా మీకు బీమా సంస్థ అండగా ఉంటుంది.
ఇంకొన్ని దేశాలు వెళ్లేముందు ఖచ్చితంగా టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. కెన్యాకు వెళ్లే ముందు యెల్లో ఫీవర్కు వ్యాక్సిన్ను తీసుకోవాలి.
కరెన్సీ మార్పిడి ఛార్జీలు
విదేశాల్లో మన కరెన్సీకి విలువ ఉండదు. ఆ యా దేశాల కరెన్సీని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కరెన్సీ ఛార్జీలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునే కరెన్సీని బట్టి రూ.150 నుంచి రూ.10 వేల వరకూ ఈ ఛార్జీలు ఉంటాయనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి.
కార్డ్ ట్రాన్సాక్షన్, విత్డ్రాయల్ ఛార్జీలు
సాధారణంగా విదేశాలకు వెళ్తున్నప్పుడు నగదుతో పాటు కార్డును కూడా ఉంచుకుంటే మంచిది. విదేశాల్లో మన కార్డ్ వాడితే 1.5-3.5 శాతం మధ్య ఛార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలు కూడా ఉంటాయనే సంగతి గుర్తుంచుకోండి. అయితే మన కార్డును ఉపయోగించి విదేశాల్లో నగదు తీసుకోవడం వల్ల 1-4 శాతం మధ్య ఛార్జీలు ఉంటాయి.
ఫోన్, ఇంటర్నెట్ ఛార్జీలు
ఇతర దేశాల్లో మన ఫోన్ పనిచేయదు. ఇంటర్నేషనల్ రోమింగ్ సౌకర్యం ఉండాలి. అయితే అక్కడ డేటా ఛార్జీలు అధికంగా ఉంటాయి. అందుకే లోకల్ సిమ్ తీసుకోవడం బెటర్. ప్లాన్స్ను బట్టి రోజుకు రూ.250 నుంచి రూ. 500 వరకూ కంపెనీలు ఛార్జీలను వసూలు చేస్తాయి. అక్కడ చాలా చోట్ల ఎక్కువగా ఫ్రీ వైఫై అందుబాటులో ఉంటుంది. దాన్ని కూడా మనం వినియోగించుకోవచ్చు. అయితే అక్కడ వ్యవస్థలన్నీ నెట్ ఆధారంగా ఉంటాయి. మ్యాప్స్ సహా అనేక సౌకర్యాలను మనం హాయిగా వినియోగించుకోవచ్చు. అందుకే డేటా ప్యాక్ తీసుకుంటే వాట్సాప్ కాల్స్ను మనం వాడుకోవచ్చు.
వీటితో పాటు ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్, ఫుడ్, షాపింగ్, సైట్ సీయింగ్, గిఫ్ట్స్ వంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. బడ్జెట్ లెక్కలేసుకున్నాక ప్రయాణం ప్లాన్ చేసుకోవాలి.