లోకసభ ఎన్నికల దెబ్బ: ఒక్క మే నెలలోనే రూ.6,399 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి
భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. అయితే ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే అంశం సస్పెన్స్గా ఉంది. ఈ ప్రభావం మార్కెట్ల పైన కూడా పడుతోంది. మరోవైపు, అంతర్జాతీయంగా అమెరికా - చైనా ట్రేడ్ వార్ మాటల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఎన్నికల్లో తర్వాత భారత్లో ఏ ప్రభుత్వం వస్తుందనే అంశంపై సస్పెన్స్, అమెరికా - చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ భారత్ కేపిటల్ మార్కెట్ నుంచి మే నెలలో రూ.6,399 కోట్లు వెనక్కి తీసుకున్నారట.
మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ తిరస్కరించారా? డోంట్ వర్రీ!
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పెట్టుబడుల వెల్లువ
దీని కంటే ముందు, ఫారన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) అంతకుముందు వరుసగా మూడు నెలల పాటు పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్ నెలలో రూ.16,093 కోట్లు, మార్చి నెలలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరి నెలలో రూ.11,182 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. వీరు డొమెస్టిక్ కేపిటల్ మార్కెట్స్ (ఈక్విటీ అండ్ డెబ్ట్)లో పెట్టుబడి పెట్టారు. అయితే మే నెలలో మాత్రం రివర్స్ అయింది.
తాజా డిపాజిట్ డేటా ప్రాకరం ఈక్విటీల నుంచి రూ.4,786 కోట్లకు పైగా, డెబ్ట్ మార్కెట్ నుంచి రూ.1,612 కోట్లకు పైగా FPIలను వెనక్కి తీసుకున్నారు. ఇది కేవలం మే 2వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మాత్రమే. అంటే కేవలం పదహారు రోజుల్లో రూ.6,399 కోట్లను వెనక్కి తీసుకున్నారు.
మార్కెట్పై ఎన్నికల అనిశ్చితి ప్రభావం
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎవరు గెలుస్తారనే అంచనాకు ఎవరూ రాలేకపోతున్నారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని, నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. కానీ సొంతగా మెజార్టీ రాదనే ప్రచార ప్రభావం మార్కెట్ల పైన కూడా పడుతోంది. మోడీ మళ్లీ ప్రధాని అవుతారని, కానీ గతంలో కంటే తక్కువ సీట్లు వస్తాయని, గతంలో అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్లు బీజేపీ గెలుచుకుందని, కానీ ఈసారి కొన్ని సీట్లు తక్కువ పడవచ్చునని భావిస్తున్నారు.
కారణాలెన్నో
సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి కారణంగా విస్తృత ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని, ఈ నేపథ్యంలో ఫారన్ ఇన్వెస్టర్లు వేచిచూద్దామనే భావనలో ఉన్నారని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు ఊహించినది కాదని, దీనికి సార్వత్రిక ఎన్నికలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణమని చెబుతున్నారు. అమెరికా - చైనా ట్రేడ్ వార్ కూడా ఓ కారణమని అంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం, భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి ద్రవ్యత తగ్గుదల, విస్తృత ఆర్థిక వ్యవస్థ అంతగా లేదని చెబుతున్నారు.