టీవీ9 లాంటి స్టోరీయే యెస్ బ్యాంక్ రాణాకపూర్ది కూడా !
మన తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 రవిప్రకాశ్ ఉదంతం ఎంత సంచలనం అవుతోందో.. బ్యాంకింగ్ రంగంలోనూ యెస్ బ్యాంక్ వ్యవహారం అంతే దుమారం రేపుతోంది. బ్యాంకును స్థాపించిన రాణాకపూర్ను యెస్ బ్యాంక్ ఎండి పదవి నుంచి తొలగించడంతో పాటు ఆయనకు ఇచ్చిన రూ.1.5 కోట్ల బోనస్ను కూడా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో యెస్ బ్యాంకులో ఏదో జరుగుతోందనే ఆందోళన అటు షేర్ హోల్డర్లు ఇటు ఖాతాదార్లలో నెలకొంది.
యెస్ బ్యాంక్ మొండి బకాయిల భారంతో కుంగిపోతోంది. బ్యాంక్ యాజమాన్యం.. అడ్డగోలుగా రుణాలను ఇచ్చిందనే అనుమానాలు మరింతగా బలపడ్తున్నాయి. దీంతో ఆర్బీఐ రాణాకపూర్ను సారధ్యాన్ని పక్కకుబెట్టింది. అత్యంత బలహీనమైనా కార్పొరేట్ గవర్నెర్నెన్స్ నేపధ్యంలో ఆర్బీఐ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. రాణా కపూర్ 2004లో యెస్ బ్యాంకును స్థాపించారు. మార్చి 2019 నాటికి ఆయనకు బ్యాంకులో 4.32 శాతం వాటా కూడా ఉంది.
LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ: ఎలిజిబులిటీ, ప్రీమియం వివరాలు
ఇప్పుడు బోనస్ కూడా పాయె..
తాజాగా ఆర్బీఐ.. యెస్ బ్యాంకుపై నిఘాను మరింత పెంచడానికి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ఎస్ గాంధీని బోర్డులో నియమించింది. దీనికి తోడు తాజాగా భేటీ అయిన బోర్డు గతంలో రాణాకపూర్కు ఇచ్చిన రూ. 1.44 కోట్ల బోనస్ను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేయమని ఆదేశించింది. లాభాల్లో ఉన్న నేపధ్యంలో 2014-15లో రూ. 62,17,823, 2015-16లో రూ.82,45,416ను బ్యాంక్ అప్పట్లో బోనస్గా డబ్బులు చెల్లించింది. 2017-18లో మాత్రం ఎలాంటి బోనస్ చెల్లించలేదు.
ఇప్పుడు ఆ మొత్తం బోనస్ను పూర్తిగా తిరిగి వెనక్కి తీసుకోవాలని కొత్త బోర్డ్ నిర్ణయించింది.
రూ.6.5 కోట్ల జీతం
జనవరి 2019 ముందున్న పది నెలల కాలానికి రాణా కపూర్ రూ.6.48 కోట్ల భారీ జీతాన్ని అందుకున్నారు. దీనికి అదనంగా బోనస్లను కూడా ఆయన గతంలో తీసుకున్నారు. ఆయన తర్వాత వచ్చిన యెస్ బ్యాంక్ కొత్త ఎండి రవ్నీత్ గిల్కు ఏడాదికి రూ.6 కోట్ల వేతనాన్ని ఇస్తున్నారు.
యెస్ బ్యాంక్ భవితవ్యం ఏంటి
యెస్ బ్యాంక్లో పారదర్శకత లోపించిన నేపధ్యంలో ఆర్బీఐ రంగంలోకి దిగింది. ప్రమోటర్ అయిన రాణా కపూర్ను ఎండి పదవి నుంచి తొలగించడంతో పాటు బోర్డులోకి ఆర్బీఐ సీనియర్ సభ్యుడిని కూడా నియమించింది. గతంలో ప్రైవేట్ బ్యాంకులైన లక్ష్మీవిలాస్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంకులో కూడా ఇదే పరిణామాలు జరిగాయి. అప్పట్లో కూడా ఆర్బీఐ స్వతంత్ర డైరెక్టర్లను నియమించింది. ఆ బ్యాంకులు కాలక్రమంలో తీసికట్టుగా తయారయ్యాయి. అప్పులు ఊబిలో కూరుకుపోయిన, మొండిబకాయిలు రాబట్టలేక ఇబ్బందిపడ్డాయి. ఇప్పుడు యెస్ బ్యాంకులో కూడా అలాంటి పరిస్థితే ఏమైనా ఎదురవుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే లక్ష్మీవిలాస్, ధనలక్ష్మితో పోలిస్తే యెస్ బ్యాంక్ పెద్దది. వాళ్లు ఇచ్చిన రుణాలు చేసే బ్యాంకింగ్ కూడా చాలా ఎక్కువ. ఏదైనా ఇబ్బంది వస్తే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్తపైనే ప్రభావం పడ్తుంది కాబట్టి ఆర్బీఐ జోక్యం ఆవశ్యకమైంది.