చమురు లాగేసిందయ్య చంద్రం... ఐఓసీ లాభం 6099 కోట్లు..! టర్నోవర్ 1.44 లక్షల కోట్లు..!!
ఢిల్లీ: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 6,099.27 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన 5,218.10 కోట్ల రూపాయల నికర లాభంతో పోలిస్తే ఇది 17 శాతం అధికం. నిల్వలు, విదేశీ మారకంపై లాభం ఆర్జించగా.. రిఫైనరీ మార్జిన్లు మాత్రం తగ్గాయి. షేరుపై లాభం 5.51 రూపాయల నుంచి 6.46రూపాయలకు పెరిగిందని ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. అంతర్జాతీయ ముడిచమురు ధరలు హెచ్చుతగ్గులు ఎదుర్కోవడంతో కంపెనీ నిల్వలపై లాభాలు గడించిందని అన్నారు. నిల్వలపై లాభం 4,172 కోట్ల రూపాయల నుంచి 2,655 కోట్ల రూపాయలకు తగ్గింది. టర్నోవర్ 1.36 లక్షల కోట్ల రూపాయల నుంచి 1.44 లక్షల కోట్ల రూపాయలకు
పెరిగిన చమురు విక్రయాలు: బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా ఐఓసీ 4.09 డాలర్లను పొందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యారెల్పై స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) 9.12 డాలర్లుగా ఉంది. దేశీయ చమురు విక్రయాలు 4.1 శాతం వృద్ధితో 21.66 మిలియన్ టన్నులకు పెరిగాయి. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ 17.35 మి.టన్నుల ముడిచమురును ఇంధనంగా మార్చింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఐఓసీ నికర లాభం 21,346.12 కోట్ల రూపాయల నుంచి 21 శాతం తగ్గి 16,894.15 కోట్ల రూపాయలకు చేరింది. టర్నోవర్ 5.06 లక్షల కోట్ల రూపాయల నుంచి 6.05 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. బీఎస్ఈలో షేరు 0.76 శాతం నష్టంతో రూ.149.70 వద్ద ముగిసింది.