రూ.12 కోట్ల నుంచి రూ.16 కోట్లు, 28 శాతం పెరిగిన TCS సీఈవో పారితోషికం
ఐటీ ఎగుమతుల్లో అగ్రగామి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో రాజేష్ గోపినాథన్ గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.16 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. అంతక్రితం ఏడాది కంటే ఇది 28 శాతం ఎక్కువ. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పరిహారం కింద రూ.1.15 కోట్లు అందుకున్న రాజేష్ గోపినాథన్, బత్తా కింద రూ.1.26 కోట్లు, కమిషన్ కింద రూ.13 కోట్లు, ఇతర అలవెన్సుల కింద రూ.60 లక్షలు పొందారు.
మొత్తంగా గత ఏడాది ఆయన రూ.16.02 కోట్లు అందుకున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.12.49 కోట్లు అందుకున్నారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 28 శాతం పెరిగిందని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది.
కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి గణపతి సుబ్రమణియన్కి గత ఏడాది వేతనంగా రూ.11.61 కోట్లు రాగా, అంతకుముందు ఏడాది రూ.9.29 కోట్లుగా ఉంది. ఆయన వేతనంలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 24.9 శాతం పెరుగుదల ఉంది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి వి రామకృష్ణన్ రూ.4.13 కోట్ల వార్షిక ప్యాకేజి లభించింది.
ముంబై కేంద్ర స్థానంగా ఐటీ సేవలు అందిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో భారత్లోని కంపెనీ ఉద్యోగుల సగటు వేతనం 6 శాతం పెరిగింది. ఇతర దేశాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వేతనాలు రెండు శాతం నుంచి ఐదు శాతం దాకా పెరిగాయి.