8.86 లక్షల మైండ్ ట్రీ షేర్లు కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీ
మైండ్ ట్రీని సొంతం చేసుకోవాలనుకుంటున్న ఎల్ అండ్ టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఓపెన్ మార్కెట్ ద్వారా మైండ్ ట్రీకి చెందిన 8.86 లక్షలకు పైగా షేర్లను ఇది కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ.980కు కొనుగోలు చేసినట్టు తెలిపింది. దీంతో మైండ్ ట్రీలో ఎల్ అండ్ టీ వాటా 26.48 శాతానికి పెరిగింది.
బ్లాక్ డీల్ ద్వారా వీజీ సిద్దార్థ, కేఫ్ కాఫీ డేలకు చెందిన దాదాపు 20 శాతం వాటాను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.3,210 కోట్లు. అప్పటి నుంచి క్రమంగా ఎల్ అండ్ టీ.. టెక్ దిగ్గజంలో తన వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. మైండ్ ట్రీలో 66 శాతం వరకు వాటాను కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
మైండ్ ట్రీని హస్తగతం చేసుకోవాలంటే ఓపెన్ ఆఫర్ ద్వారా మరింత వాటాను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా 31 శాతం వాటాను రూ.950 (ఒక్కో షేరుకు) వద్ద కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) అనుమతిని కోరింది.