భారతీయులు శక్తిమేరకు పని చేయడం లేదా? చైనా పత్రిక విశ్లేషణ
భారతీయులు వారి పూర్తిస్థాయి శక్తిమేరకు పని చేయడం లేదట. అందుకే చైనా ఉత్పత్తులను భారత్లో నిషేధించినా.. ఎక్కువ కాలం దాని ప్రభావం ఉండదని ఒక చైనా పత్రిక విశ్లేషించింది. చైనాకు ధీటుగా ఎదగాలంటే భారతీయులు తప్పనిసరిగా 996 (9AM to 9 AM) ఆరు రోజులు పని చేయాలట. ఈ 996 పనివేళలను చైనా దేశపు అత్యంత ధనికుడు, అలీబాబా సంస్థ అదినేత జాక్ మా ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయినప్పటికీ భారత్లో తయారీ రంగం పుంజుకోవాలన్నా ఈ రంగంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు తరలి రావాలన్నా.. మన పరిశ్రమల్లో రోజుకు 12 గంటలు.. వారానికి ఆరు రోజులు (996) కార్మికులు శ్రమించాలనేది చైనా పత్రిక సూచన అని దానిని ఉటంకిస్తూ ది ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది.
అలా కష్టపడకపోతే, సమీప భవిష్యత్తులో భారత్లో చైనాకు ఎలాంటి ముప్పు వాటిల్లదని సారాంశం. ఎలాగూ చైనీయులు అధిక పని గంటలు శ్రమిస్తూ దేశాన్ని ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారని, నాణ్యమైన, అధిక ఫీచర్లున్న ఉత్పత్తులను చవక ధరలకే అందించే సత్తా కేవలం చైనాకే ఉందని పేర్కొంది.
భారత్లో కొన్ని గ్రూప్లు జాతీయ భావం పేరుతో చైనా ఉత్పత్తులను నిషేధించాలని కోరుకుంటున్నా.. అది దీర్ఘకాలంలో సాధ్యం కాదని అంచనా వేసింది. నిజంగా ఉత్పత్తులను బహిష్కరిస్తే అది కేవలం స్వల్పకాలికానికే పరిమితం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది.
చైనాను సమర్థంగా ఎదుర్కోవాలంటే, ముఖ్యంగా పారిశ్రామిక, తయారీ రంగంలో భారత్ అధిక పని గంటల సంస్కృతిని అలవాటు చేసుకోవాల్సిందేనని ఉవాచ పలికింది. ఈ మేరకు భారీయులు వారి పూర్తి సామర్థ్యం మేరకు కష్టపడి పని చేస్తే కొంత మార్పు సాధ్యమేనని సూచించింది. భారత్లో రోజుకు 8 గంటలు పని వేళలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనిని 12 గంటలకు పెంచడం రాజకీయంగా సాధ్యం కాకపోవచ్చు.