జెట్ ఎయిర్వేస్కు భారీ షాక్: నిన్న డిప్యూటీ, నేడు సీఈవో రిజైన్.. 2 రోజుల్లో ఇద్దరు ఔట్
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, తాత్కాలికంగా సర్వీసులు నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్లో మరో కుదుపు. డిప్యూటీ సీఈవో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) అమిత్ అగర్వాల్ వ్యక్తిగత కారణాలతో సోమవారం నాడు తన పదవికి రాజీనామా చేశాడు. ఆయన కంపెనీ నుంచి తప్పుకున్నట్లు జెట్ వెల్లడించింది.
మే 13వ తేదీన డిప్యూటీ సీఈవో, సీఎఫ్ఓ అమిత్ అగర్వాల్ పర్సనల్ రీజన్స్తో పదవి నుంచి తప్పుకున్నాడని రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశాన్ని వెల్లడించలేదు.
అమిత్ అగర్వాల్ 2015లో జెట్ ఎయిర్వేస్ సీఎఫ్ఓగా కంపెనీలో చేరాడు. అమిత్ రాజీనామా నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేర్లు మరింత కుప్పకూలాయి. మంగళవారం ఉదయం సెషన్లో షేర్లు మరో 12 శాతం తగ్గాయి. అంతకుముందు రోజు 139.45 వద్ద బీఎస్ఈలో షేర్లు క్లోజ్ అయ్యాయి. మంగళవారం రాజీనామా నేపథ్యంలో 12.44 శాతం తగ్గి 122.10 వద్ద కొనసాగాయి. ఏప్రిల్లో జెట్ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అప్పటి నుంచి పలువురు కంపెనీ నుంచి తప్పుకున్నారు.
ఆన్లైన్ ద్వారా SBI అకౌంట్ను సులభంగా ట్రాన్స్ఫర్ చేయండి
జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం రుణదాతల చేతిలో ఉంది. ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం జెట్ కోసం బిడ్స్ కూడా ఆహ్వానించింది. ఇటీవలే ఇది ముగిసింది. ప్రస్తుతం ఎక్కువ స్టేక్స్ ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేతుల్లో ఉంది. ఎతిహాద్తో పాటు మరికొన్ని సంస్థల నుంచి బిడ్స్ వచ్చాయి. బిడ్స్ సమర్పణకు చివరి తేది గత శుక్రవారం రోజు ముగిసింది.
సీఈవో కూడా రిజైన్
జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే కూడా తన పదవికి రాజీనామా చేశాడు. రెండు రోజుల్లో ఇద్దరు కీలక వ్యక్తులు రాజీనామా చేయడం జెట్ ఎయిర్వేస్కు పెద్ద కుదుపు. డిప్యూటీ సీఈవోగా ఉన్న అమిత్ అగర్వాల్ సోమవారం రిజైన్ చేయగా, వినయ్ దుబే వ్యక్తిగత కారణాలతో మంగళవారం నాడు రాజీనామా చేశారు. రెండు రోజుల్లోనే ఇద్దరు అధికారులు రిజైన్ చేశారు.
ఎతిహాద్ బిడ్
జెట్ ఎయిర్వేస్లో 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్ సంస్థ మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు శుక్రవారం చివరిక్షణంలో బైండింగ్ బిడ్ దాఖలు చేసింది. అయితే సంస్థ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం మైనార్టీ భాగస్వామి కావాలని పేర్కొంది. జెట్ ఎయిర్వేస్లో మెజార్టీ వాటా నిమిత్తం టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్టనర్స్, ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి.ఇందులో ఎతిహాద్ బిడ్ పూర్తిస్థాయిలో అర్హత కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ సంస్థ జెట్ కోసం బైడింగ్ బిడ్ను దాఖలు చేసిందని సమాచారం.
జెట్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు తాము సుముఖంగానే ఉన్నప్పటికీ ఆ వాటా నిమిత్తం మొత్తంగా పెట్టుబడి పెట్టేందుకు తమ సంస్థ సిద్ధంగా లేదని ఎతిహాద్ తెలిపింది. ఇందుకు భారత్లోని ఇతర సంస్థల వారితో భాగస్వామ్యం నిమిత్తం చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. భారత్లో వాయు రవాణా వేగంగా అభివృద్ధి చెందుతోందని, అంతేకాక తమ మాతృదేశం యూఏఈకి భారత్ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక భాగస్వామి కాబట్టి జెట్పై తాము ఆసక్తి కలిగి ఉన్నట్లు ఎతిహాద్ తెలిపింది. జెట్ను నిలిబెట్టేందుకు గాను కీలక భాగస్వామి అన్వేషణను తాము గత 15 నెలలుగా కొనసాగిస్తున్నామని తెలిపింది. జెట్లో సమస్య పరిష్కారానికి తమ ప్రయత్నాలు ఇకపై కూడా కొనసాగుతాయని పేర్కొంది.
జెట్ బిడ్స్ ప్రక్రియ 10వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. బ్యాంకుల కన్సార్టియం కూడా జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉద్యోగులు కూడా అదే కోరుకుంటున్నారు.