ITCని సిగరేట్ నుంచి ఎఫ్ఎంసీజీకి స్థాయికి తీసుకెళ్లిన వైసీ దేవేశ్వర్ కన్నుమూత
ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్ శనివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 72. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐటీసీని సిగరెట్ల వ్యాపారంతో విభిన్న వ్యాపారాల్లోకి తీసుకెళ్లిన విజయవంత బిజినెస్మెన్. 1996లో ఐటీసీ ఛైర్మన్, సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండు దశబ్దాలపాటు ఆ పదవులను విజయవంతంగా నిర్వహించారు. భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు ఒక కార్పొరేట్ సంస్థకు అత్యున్నత అధికారిగా సేవలందించిన వాళ్లలో ఇతను ఒకరు. 2017లో సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. కానీ అప్పటి నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో ఉన్నారు.
SBI, HDFC, ICICI మినిమం బ్యాలెన్స్: పెనాల్టీ తప్పించుకోండి!
ఆయన కృషికి గాను ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సిగరేట్ దిగ్గజంగా ఉన్న ఐటీసీని ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, ఐటీ సహా మరిన్ని రంగాల్లో విస్తరించారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ (తెలంగాణ), చంద్రబాబు నాయుడు (ఏపీ, ఆపద్ధర్మ)లు సంతాపం వ్యక్తం చేశారు. దేవేశ్వర్ మృతి తమకు తీరని లోటు ఐటీసీ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పురి అన్నారు.
సిగరేట్ల పైనే కాకుండా ఇతర రంగాలపై దృష్టి పెట్టాలని అంతకుముందు చైర్మన్లు భావించారు. కానీ విఫలమయ్యారు. దేవేశ్వర్కు కూడా చేదు అనుభవం ఎదురయ్యారు. వాటిని ఎదుర్కొని ముందుకు సాగారు. ఎప్ఎంసీజీలో వినూత్న బ్రాండ్లు ప్రవేశపెట్టారు. రైతులకు అంతర్జాతీయ విపణులకు అనుసంధానం చేసే ఈ-చౌపల్ను ఐటీసీ ప్రారంభించింది దేవేశ్వర్ హయాంలోనే. హోటళ్లు, ఆర్థిక సేవలు, వంట నూనెలు, విదేశీ రెస్టారెంట్లు, స్థిరాస్థి వ్యాపారాలపై దృష్టి సారించారు.
దేవేశ్వర్ ఐటీసీలో 1968లో చేరారు. ఎన్నో పదవులు నిర్వహించారు. 1984లో డైరెక్టర్గా నియమితులయ్యారు. 1996 జనవరి 1 నుంచి ఐటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, చైర్మన్గా నియమించబడ్డారు. సంక్షోభ సమయంలో పదవి చేపట్టి ఆయన ముందుకు నడిపించారు. సిగరేట్లపై ప్రభుత్వం పన్నుల భారం, ఐటీసీలో నాటి అతిపెద్దవాటాదారు నుంచి టేకోవర్ ముప్పు వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దేవేశ్వర్ పగ్గాలు చేపట్టేనాటికి రూ.5,200 కోట్ల వరకు ఉన్న ఐటీసీ వ్యాపారం, 2017-18 నాటికి రూ.44,329 కోట్లకు చేరుకుంది.
దేవేశ్వర్ హయాంలో ఐటీసీ విభిన్న రంగాల్లో అడుగు పెట్టింది. 1998లో వంట నూనెలు, ఆర్థిక సేవల వ్యాపారాల విక్రయం, 2000లో విల్స్ లైఫ్ స్టయిల్ ప్రారంభించారు. అదే సమయంలో ఐటీసీ ఇన్ఫోటెక్ ఏర్పాటు చేశారు, ఈ-చౌపల్ ప్రారంభించారు. 2002-03 ఆశీర్వాద్ బ్రాండ్ను తీసుకు వచ్చారు. సన్ ఫీస్ట్ బిస్కెట్లు తెచ్చారు. 2007-09లో బింగో, ఫియామా బ్రాండ్లను ఆవిష్కరించారు. 2012లో జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి సావ్లాన్ బ్రాండ్ను కొనుగోలు చేశారు.