ఆర్థిక ప్రగతి సూపర్..! ఆదాయంలో 11 శాతం వృద్ధి..!!
ఢిల్లీ/హైదరాబాద్ : జనవరి- మార్చి త్రైమాసికానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్టాండలోన్ ప్రాతిపదికన 838.40 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో ఈ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు 7,718.17 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదుచేసింది. ఆస్తుల నాణ్యత మెరుగవడం, రుణాల వ్యయాలు 1% మేర తగ్గడం ఇందుకు దోహదం చేసింది. అలాగే కష్టకాలం ముగిసిందని, ముందంతా మంచికాలమేనని పేర్కొంది.
SBI కస్టమర్లకు శుభవార్త: లోన్ తీసుకునే వారికి ఊరట, వడ్డీ రేట్లు తగ్గింపు, ఎంత తగ్గుతుందంటే?
ఎస్బీఐ అదిరే పికప్..! జనవరి- మార్చిలో ఊహించని లాభాలు..!!
స్టాండలోన్ ఆదాయం కూడా 11 శాతం పెరిగి రూ.68,436.06 కోట్ల నుంచి రూ.75,670.50 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో (2018-19) ఎస్బీఐ రూ.862 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017-18లో రూ.6,547 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ‘అన్ని విభాగాల్లో అద్భుత పనితీరును బ్యాంకు కనబర్చింది. ఆస్తుల నాణ్యత మెరుగైంది. స్థూల, నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తులు గణనీయ స్థాయిలో తగ్గాయ'ని ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ విలేకరులకు తెలిపారు.
తొలి త్రైమాసికంపై ఆశావహం..! మలి దశలో కూడా మెరుపులే..!!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మెరుగైన పనితీరును కనబరుస్తామని ఆశిస్తున్నామని రజనీశ్ పేర్కొన్నారు. 2019-20లో 10-12% రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్ 2.82 శాతం నుంచి 3.02 శాతానికి పెరగడం లాభం నమోదుకు కారణమైందని చెప్పారు. 2019 మార్చి చివరి నాటికి ఎస్బీఐ స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) నిష్పత్తి 10.91 శాతం (రూ.2,23,427 కోట్లు) నుంచి 7.53 శాతానికి (రూ.1,72,750 కోట్లు) తగ్గింది. నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి కూడా 5.73 శాతం (రూ.1,10,855 కోట్లు) నుంచి తగ్గి 3.10 శాతానికి (రూ.65,895 కోట్లు) పరిమితమైంది. కేటాయింపుల నిష్పత్తి 66.197 శాతం నుంచి 78.73 శాతానికి పెరిగింది.
ఆ మూడింటికి 100% కేటాయింపులు..! లాభాలపై భారీ అంచనాలు..!!
ఆర్బీఐ తొలి జాబితాలోని మూడు కీలక రుణ ఖాతాలు -ఎస్సార్ స్టీల్, భూషన్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్లకు సంబంధించిన కేసు చివరి దశకు చేరుకుందని కుమార్ తెలిపారు. అయినప్పటికీ వీటి కోసం 100 శాతం కేటాయింపులు చేసినట్లు చెప్పారు. కేసు ప్రక్రియ ముగిస్తే ఈ మూడు ఖాతాల నుంచి 16,000 కోట్ల రూపాయల వరకు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. ఐఎల్అండ్ఎఫ్ఎస్ నుంచి 3,487 కోట్ల రూపాయల మేర రుణాలు ఇచ్చామని వీటిలో 1,125 కోట్ల రూపాయలు ఎన్పీఏలుగా మారాయని తెలిపారు. ఇందుకు 50 శాతం కేటాయింపులు చేసినట్లు చెప్పారు. 2018-19లో 19,000 కోట్ల రూపాయల మేర రుణ ఖాతాలను ఎన్బీఎఫ్సీల నుంచి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
ఎంసీఎల్ఆర్లో 0.05% కోత..! పెరిగిన ఎస్బీఐ షేరు..!!
అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) ఎస్బీఐ 0.05 శాతం (5 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. దీంతో సంవత్సర కాలానికి ఎంసీఎల్ఆర్ 8.5 శాతం నుంచి 8.45 దిగివచ్చింది. సవరించిన రుణ రేట్లు మే 10 నుంచే అమల్లోకి వచ్చాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 2019 ఏప్రిల్ 10 నుంచి గృహ రుణ రేట్లు కూడా 15 బేసిస్ పాయింట్లు మేర తగ్గాయని పేర్కొంది. ఏప్రిల్లో ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన తర్వాత ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ను తగ్గించడం ఇది రెండోసారి. గత నెలలో కూడా ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ విధాన రేట్లు అత్యుత్తమ రీతిలో బదలాయింపు జరిగేందుకు లక్ష రూపాయలకు పైబడిన క్యాష్ క్రెడిట్/ ఓవర్ డ్రాఫ్ట్ రేట్లను మే 1 నుంచి రెపో రేటుకు అనుసంధానం చేసినట్లు ఎస్బీఐ తెలిపింది.3% పెరిగిన షేరు తో ఎస్బీఐ కళకళలాడుతున్నట్టు మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.