జెట్ ఎయిర్వేస్కు HDFC షాక్, రుణం కింద అమ్మకానికి ముంబై ఆఫీస్
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్కు షాక్. ఇచ్చిన రుణాలు రికవరీ చేసుకునేందుకు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ముంబై నగరంలోని జెట్ ఎయిర్వేస్ ఆఫీస్ ఒకటి అమ్మకానికి పెట్టింది. జెట్ ఎయిర్వేస్కు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ రూ.414 కోట్లకు పైగా అప్పు ఇచ్చింది.
SBI ఆఫర్: ఏసీ కొంటున్నారా.. ఈ కార్డుతో రూ.1,500 క్యాష్ బ్యాక్
ఈ రుణం కోసం జెట్ ఎయిర్వేస్ బంద్రాకుర్లా కాంప్లెక్స్ నాలుగో అంతస్తులోని జెట్ ఎయిర్వేస్ ఆఫీస్ను తాకట్టు పెట్టింది. ఇప్పుడు దీనిని హెచ్డీఎఫ్సీ విక్రయానికి పెట్టింది. బకాయిలు చెల్లించడంలో జెట్ ఎయిర్వేస్ విఫలమైందని, దీంతో నిబంధనల ప్రకారం ఆ కంపెనీ తనఖా కింద పెట్టిన స్థిరాస్తి పైన తమకు హక్కు లభించిందని హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ తెలిపింది.
బాంద్రాకుర్లలోని ఈ కార్యాలయం 52,775 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆఫీస్ను రూ.245 కోట్ల రిజర్వ్ ధరతో హెచ్డీఎఫ్సీ ఈ-వేలానికి పెట్టింది. మే 15న ఈ వేలం ప్రక్రియ జరగనుది.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17వ తేదీన తన కార్యకలాపాలను నిలిపేసిన విషయం తెలిసిందే. 120 విమానాలు నడిపే సంస్థ.. ఆ తర్వాత క్రమంగా విమానాల కార్యకలాపాలు తగ్గించింది. చివరకి ఏప్రిల్ 17న తాత్కాలికంగా అన్నింటిని నిలిపేసింది. ఆర్థిక ఇబ్బందులతో నాలుగు నెలల నుంచి తమ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేదు. దీంతో జీతాల కోసం సంస్థ సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు.